Child Dead in Hot Sambar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో విషాదం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లాలోని పాణ్యం విజయానికేతన్ స్కూల్లో వేడి సాంబార్ లో పడి చిన్నారి మృతి చెందిన ఘటన స్థానికంగా అందరి మనసును కలచివేసింది. పాఠశాల యాజమాన్యం, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ చిన్నారి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. హాస్టల్లోని వంట పాత్రలో పడి చిన్నారి చనిపోవడం.. పలు అనుమానాలకు తావిస్తోంది.కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం తిప్పాయిపాలెం గ్రామానికి చెందిన బాలుడు పురుషోత్తం రెడ్డిని పాణ్యం విజయానికేతన్ స్కూల్లో తల్లిదండ్రులు చదివిస్తున్నారు. అయితే.. పాఠశాల హాస్టల్ గదిలోని సాంబార్ పాత్రలో చిన్నారి పడిపోయాడు. అది గమనించిన ఆయా.. బాలుడిని తీసేలోపే.. శరీరమంతా.. బొబ్బలు వచ్చేశాయి. తీవ్రగాయాలైన బాలుడిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా లాభం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఆ బాలుడు మృతి చెందాడు.ఈ విషయం తెలుసుకున్న స్కూల్ యాజమాన్యం డెడ్బాడీని ఆస్పత్రిలోనే వదిలేసి పరార్ అయ్యింది. ఆస్పత్రికి చేరుకున్న తల్లిదండ్రులు యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి మృతికి కారణమైన పాఠశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయ్యాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
tags: kurnool, boy, sambar, vijayanikethan school, purushottam reddy, died