GOLD RATE INCREASED
బంగారం ధర భారీగా పెరగనుంది. మిడిల్ ఈస్ట్లో భౌగోళిక రాజకీయ అనిశ్చిత పరిస్థితులు బంగారం ధర పెరగటానికి కారణాలని తెలుస్తుంది. 10 గ్రాముల ధర 2019 సంవత్సరాంతానికి మన దేశంలో 42 వేల రూపాయలను తాకుతుందని కమోడిటీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితి, ఉద్రిక్తతలు, డాలర్ మారకంలో రూపాయి విలువ బలహీనత, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పసిడి కొనుగోళ్లు వంటి అంశాలు దేశంలో పసిడి ధర పరుగుకు దోహదపడతాయని వారి విశ్లేషణ. మిడిల్ ఈస్ట్లో భౌగోళిక రాజకీయ అనిశ్చిత పరిస్థితులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. దీనితో ఈ ఏడాది డిసెంబర్ నాటికి అంతర్జాతీయ ఫ్యూచర్స్ కమోడిటీ మార్కెట్ నైమెక్స్లో పసిడి ఔన్స్ 31.1గ్రాము ధర 1,650 డాలర్లకు చేరవచ్చు.
ఇక దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో ఈ ధర 10 గ్రాములకు ఏకంగా 42 వేల రూపాయలకు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి అని కాంట్రెంజ్ రిసెర్చ్ సహ వ్యవస్థాపకులు, సీఈఓ జ్ఞాన్శేఖర్ త్యాగరాజన్ పేర్కొన్నారు. ఈ ఏడాది చివరి వరకూ పసిడి ధర పెరుగుదల ధోరణినే కనబరుస్తుందని ఆయన పేర్కొన్నారు.ఈక్విటీల్లో సంవత్సరాంతం డెరివేటివ్ పొజిషన్ల స్క్వేరాఫ్ అవకాశాలు కూడా పసిడి ధర పెరుగుదలకు దోహదపడుతుందని ఆయన విశ్లేషించారు. పెట్టుబడులకు సురక్షిత సాధనంగా ఇన్వెస్టర్ పసిడిని చూస్తాడనడానికి పలు కారణాలు కనబడుతున్నాయని అన్నారు. ఎంసీఎక్స్లో బంగారం 10 గ్రాముల ధర శుక్రవారం ట్రేడింగ్ చివరకు 38 వేల293 రూపాయల వద్ద ముగిసింది. బుధవారం నుంచి బంగారం ధరకు రెక్కలు రావడం ప్రారంభమవుతుందని, నవంబర్ నెలాఖరుకు 40 వేల రూపాయలకు, డిసెంబర్ చివరి నాటికి 42 వేల రూపాయలకు చేరుతుందని ట్రేడర్స్ అంఛనా వేస్తున్నారు.