HARSIMRATH KAUR RESIGN
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ సంబంధ బిల్లులు ఎన్డీయే కూటమిలో చిచ్చు పెట్టేలా కనిపిస్తోంది. ఈ బిల్లులను నిరసిస్తూ కేంద్రమంత్రి పదవికి శిరోమణి అకాలీదళ్ సభ్యురాలు హర్సిమ్రత్ కౌర్ బాదల్ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామాను సమర్పించేందుకు ప్రధాని మోదీ కార్యాలయానికి ఆమె వెళ్లారు. శిరోమణి అకాలీదళ్ ఎన్డీయేలో ప్రధాన భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, రైతులు, వ్యవసాయ సంబంధఉత్పత్తులకు సంబంధించిన కీలక బిల్లులను కేంద్రం తీసుకురాగా.. వీటిలో అనేక అంశాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని, వ్యవసాయ రంగం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నుంచి మరింత ఇబ్బందుల్లో పడే అవకాశంఉందని అకాలీదళ్ అభిప్రాయపడింది. ఈ బిల్లు చట్టరూపందాలిస్తే వ్యవసాయరంగం సంక్షోభంలోకి వెళ్తుందని పేర్కొంటూ కేంద్రంతో అకాలీదళ్ విబేధించింది. ఈరకమైన అభిప్రాయాన్ని ఇప్పటివరకు ఎక్కడా వ్యక్తంచేయని అకాలీదళ్.. లోక్సభలో చర్చ సందర్భంగా లేవనెత్తడం ప్రభుత్వాన్ని కొంత ఇబ్బందికి గురిచేసినట్టయింది.
ఈ బిల్లులపై లోక్సభలో చర్చ సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు సుఖ్బీర్సింగ్ బాదల్ మాట్లాడుతూ.. ఈ బిల్లు వ్యవసాయరంగానికి వ్యతిరేంకగా ఉందని, తాము పూర్తిస్థాయిలో వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇకపై తమ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో కొనసాగలేదని స్పష్టంచేశారు. ఇప్పుడు తమ పార్టీ తరఫున కేంద్రమంత్రిగా ప్రాతినిద్యం వహిస్తున్న హర్సిమ్రత్ కౌర్ బాదల్ తన పదవికి రాజీనామా చేస్తున్నారని ఆయన ప్రకటించారు. అనంతరం కొద్దిసేపటికే సభ నుంచి బయటకు వచ్చిన హర్సిమ్రత్ కౌర్ బాదల్ పీఎంవోకు వెళ్లారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న రైతు వ్యతిరేక విధానానికి వ్యతిరేకంగానే తానీ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె తెలిపారు. అయితే, శిరోమణి అకాలీదళ్ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చినప్పటికీ ఎన్డీయేలో కొనసాగనున్నట్టు సమాచారం.