income tax returns date extended
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ఇక కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దాదాపు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతుండటంతో.. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ తేదీని పొడగిస్తున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2018-19 సంవత్సరానికి రిటర్న్స్ ఫైల్ చేసే గడువును మార్చి 31,2020 నుంచి జూన్ 30,2020 వరకు పొడగించారు. ఇందుకు గాను ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయడం ఉండదన్నారు. ఆదాయపు పన్ను, కస్టమ్స్, దివాలా, దివాలా కోడ్ (ఐబిసి) సంబంధిత అంశాలు, బ్యాంకుకు సంబంధించిన ఫిర్యాదులు, ఫిషరీస్ వంటి అంశాలపై త్వరలో కీలక ప్రకటనలు చేయనున్నట్టు తెలిపారు. ఆలస్యంగా చేసే చెల్లింపుల కోసం వడ్డీ రేటును 12 శాతం నుంచి 9 శాతానికి తగ్గించామన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన మీడియా సమావేశంలో సీతారామన్ ఈ వివరాలు వెల్లడించారు. ఆధార్తో పాన్ కార్డును లింక్ చేసే గడువును కూడా మార్చి 31,2020 నుంచి జూన్ 30,2020 వరకు పొడగించనున్నట్టు తెలిపారు. అలాగే ఆలస్యమైన టీడీఎస్ డిపాజిట్లపై వడ్డీ రేటును తగ్గించనున్నట్టు చెప్పారు. ఇక మార్చి,ఏప్రిల్,మే 2020లకు సంబంధించిన జీఎస్టీ రిటర్న్స్ దాఖలుకు కూడా చివరి గడువును జూన్ 20,2020వరకు పొడగించారు. రూ.5కోట్లు టర్నోవర్ దాటని కంపెనీలకు ఎలాంటి వడ్డీలు,పెనాల్టీలు,ఆలస్యపు రుసుములు ఉండవని స్పష్టం చేశారు. అంతేకాదు,అలాంటి కంపెనీలకు వడ్డీ రేటును 9శాతం తగ్గిస్తున్నట్టు చెప్పారు. పరోక్ష పన్ను విధానంలో వివాదాలను పరిష్కరించడానికి ఉద్దేశించిన ‘సబ్కా విశ్వాస్’ పథకం కింద చెల్లింపు తేదీని 2020 జూన్ 30 వరకు పొడిగించినట్టు ప్రకటించారు.
ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతామని చెప్పారు. త్వరలో భారీ ఆర్థిక ప్యాకేజీ కరోనా వైరస్ నియంత్రణ చర్యలు ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుండటంతో త్వరలో భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తామన్నారు. ఆర్థిక ఎమర్జెన్సీని ప్రకటించే ఉద్దేశం లేదన్నారు.తప్పనిసరిగా నిర్వహించాల్సిన బోర్డు సమావేశాలన్నింటికి 60 రోజుల పాటు సడలిస్తున్నట్టు చెప్పారు. అయితే, 2019-20 సంవత్సరానికి బోర్డు సమావేశం నిర్వహించి ఉండకపోతే దాన్ని ఉల్లంఘనగా పరిగణించాల్సి ఉంటుందన్నారు. 2019-20కి వర్తించే కంపెనీల ఆడిటర్ రిపోర్ట్ ఆర్డర్-2020ను 2020-21కి మారుస్తున్నట్టు తెలిపారు. కొత్త సంస్థలు ఆరు నెలల్లోపు డిక్లరేషన్ దాఖలు చేయాల్సి ఉంటుందని.. కానీ రిటర్న్స్ దాఖలుకు ప్రభుత్వం అదనంగా మరో ఆరు నెలలు గడువు ఇస్తోందని ప్రకటించారు. ఇదే పరిస్థితి మరో ఆర్నెళ్లు కొనసాగితే దివాలా మరియు దివాలా కోడ్ చట్టం(IBC)లోని సెక్షన్ 7,9,10లను తొలగించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. రాబోయే మూడు నెలలకు డెబిట్ కార్డు హోల్డర్స్ ఏ బ్యాంకు ఏటీఎం నుంచైనా డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చునని.. ఇందుకు ఎలాంటి చార్జీలు వసూలు చేయరని తెలిపారు. అంతేకాదు,మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలు కూడా ఉండవన్నారు. డిజిటల్ లావాదేవీలు,డిజిటల్ వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకే ఈ చర్యలు అని చెప్పారు.
tags: Corona Virus Corona Effect, Corona Cases India, Income Tax Returns Date Extension, Debit Cards, Banking, Finance Minister, Nirmala Seetharaman