Nayani NarasimhaReddy Dead
తెలంగాణ ఉద్యమకారుడు, ప్రప్రథమ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మరణించారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. బుధవారం అర్థరాత్రి 12.25 గం.లకు (గురువారం) ఆయన చనిపోయారని అపోలో ఆస్పత్రి అధికారికంగా వెల్లడించింది. వారం రోజుల క్రితం కొవిడ్ అనంతరం ఏర్పడిన సమస్యలు, ప్రధానంగా ఊపిరితిత్తులు దెబ్బతినడంతో మరణించారని ప్రకటించింది. కాకపోతే, ఆయన మరణం గురించి అధికారిక ప్రకటన వెలువడక ముందే, పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేయడం గమనార్హం.
ఆయన మరణం తెలంగాణకు తీరని లోటు అని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్యే జలగం వెంకటరావులు బుధవారం సాయంత్రమే సంతాపం తెలిపారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాయిని నర్సింహారెడ్డిని మంత్రి కేటీఆర్ తో పాటు ఇతర మంత్రులు గత రెండు రోజుల్నుంచి పరామర్శించారు. బుధవారం సీఎం కేసీఆర్ అపోలో ఆస్పత్రికి చేరుకుని నాయిని కుమారుడ్ని ఓదార్చారు. ఆ తర్వాతే ఆయన మరణించారనే వార్త ఎంపీ, ఎమ్మెల్యేల ప్రకటనల ద్వారా బయటికొచ్చింది. కాకపోతే, మాజీ హెం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అపోలో ఆస్పత్రి అధికారికంగా బుధవారం రాత్రి ప్రకటించింది. కాకపోతే, బుధవారం అర్థరాత్రి (గురువారం ఉదయం 12.25 గం.లకు) మరణించారని అపోలో ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది.