సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఊహించని పరిణామం ఎదురైంది. మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్యెల్సీ ఉపఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందాడు. కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డిపై.. బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్కుమార్ రెడ్డి ఘన విజయం సాధించారు. 111 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్కుమార్ రెడ్డి గెలుపొందారు. ఈ గెలుపుతో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంది.. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఫలితం వెలువడింది.. బీఆర్ఎస్కు -763, కాంగ్రెస్కు -652 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థికి ఒక ఓటు పోలయింది.. 1437 ఓట్లలో 21చెల్లని ఓట్లుగా నిర్ధారించారు. పోలింగ్ జరిగిన రెండు నెలల తర్వాత ఇవాళ కౌంటింగ్ జరిగింది.
మార్చి 28న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పది పోలింగ్ కేంద్రాలలో ఎన్నికను నిర్వహించారు. మొత్తం 1,439 మంది స్థానిక సంస్థల ఓటర్లుండగా… అందులో 1,437 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 99.86 శాతం పోలింగ్ నమోదైంది. ఉమ్మడి జిల్లా స్థానిక ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీగా ఉన్న కశిరెడ్డి నారాయణరెడ్డి గత నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మారడం.. కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈ స్థానం ఖాళీ అయ్యింది. బీఆర్ఎస్ తరఫున నవీన్కుమార్ రెడ్డి పోటీ చేయగా, కాంగ్రెస్ పార్టీ నుంచి మన్నె జీవన్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్గౌడ్ బరిలో నిలిచారు. ఈ పోటీకి బీజేపీ దూరంగా ఉన్నది. మొత్తం 1437 మంది ఓటుహక్కు వినియోగించుకోగా, ఇద్దరు ఎంపీటీసీలు ఓటింగ్కు దూరంగా ఉన్నారు. నువ్వా నేనా అన్నట్లు సాగిన ఎన్నిక ఫలితం ఏప్రిల్ 2వ తేదీనే రావాల్సి ఉంది.. అయితే.. ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉన్న చివరి నిమిషంలో వాయిదా వేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఈ ఫలితాల ప్రభావం వాటిపై పడే అవకాశం ఉందని కౌంటింగ్ ను జూన్ 2వ తేదీకి మార్చారు. ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిపొందాడు.