Friday, July 5, 2024

06వ తేదీన సిఎంల భేటీలో ఆస్తులు, అప్పులు కొలిక్కి వచ్చేనా…?

భవనాలు, బిల్డింగ్‌లు మనకు దక్కేనా…!
విభజన సమస్యలపై ఈనెల 6వ తేదీన ఇరు రాష్ట్రాల సిఎంలు హైదరాబాద్‌లో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలోనే 9,10 షెడ్యూల్‌తో పాటు ఆస్తులు, అప్పులు ఓ కొలిక్కి రానున్నాయి. ఎపి సిఎం చంద్రబాబు సోమవారం తెలంగాణ సిఎం రేవంత్‌కు భేటీ విషయమై లేఖ రాయగా, తెలంగాణ సిఎం రేవంత్ దానికి సమ్మతిని తెలియచేస్తూ మంగళవారం ఎపి సిఎం లేఖ రాశారు. అందులో భాగంగా ఈనెల 06వ తేదీన హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో భేటీ అవుతామని తెలంగాణ సిఎం ఈ లేఖలో పేర్కొన్నారు. అయితే వీరిద్దరి భేటీలో భాగంగా ఆస్తులు, అప్పులతో పాటు 9,10 షెడ్యూల్‌కు సంబంధించి వివాదాలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు భావిస్తున్నాయి. జూన్ 02వ తేదీ నాటికి ఉమ్మడి రాజధానికి 10 ఏళ్లు దాటిపోవడంతో ఇన్ని రోజులు ఎపి ప్రభుత్వం వాడుకున్న భవనాలు, ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటు తెలంగాణ నుంచి ఎపికి, ఎపి నుంచి తెలంగాణకు చెల్లించాల్సిన బకాయిలు, ఆస్తులు, అప్పుల వివరాలను ఇరు రాష్ట్రాలు సిద్ధం చేసుకున్నాయి.

8 కుల సంఘాల సంస్థల విభజనకు ఇరుపక్షాల అంగీకారం
రాష్ట్ర విభజన తరవాత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా కెసిఆర్ తో రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజనపై రెండు రాష్ట్రాల మధ్య చర్చలు జరిపారు. ఇరు రాష్ట్రాల మధ్య జరగాల్సిన సంప్రదింపులకు మధ్యలోనే బ్రేక్ పడింది. 2017లో మంత్రుల కమిటీని ఏర్పాటు చేశారు. అనంతరం రాజ్ భవన్‌లో అప్పటి గవర్నర్ నరసింహన్ సమక్షంలో ఒక్క సమావేశం జరిగింది. ఆ తరువాత మీటింగ్‌లు జరగలేదు. ఆ సమావేశంలో షెడ్యూల్ తొమ్మిదికి చెందిన 8 కుల సంఘాల సంస్థల విభజనకు ఇరుపక్షాల అంగీకారం కుదిరింది. మిగిలిన అన్ని అంశాలపై ఏకాభిప్రాయనికి రాలేదు.

మరో 23 సంస్థల విభజనపై అభ్యంతరాలు…
ఇక, ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న వాటిలో ప్రధానమైనవి షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన. షెడ్యూల్ 9లో మొత్తం 91 సంస్థలు ఉండగా, షెడ్యూల్ 10లో 142 సంస్థలు ఉన్నాయి. షెడ్యూల్ 9 సంస్థల విషయంలో షీలాభిడే సిఫారసుల మేరకు 68 సంస్థల విభజనకు తెలంగాణ సుముఖంగా ఉంది. మరో 23 సంస్థల విభజనపై తన అభ్యంతరాలను కేంద్రానికి తెలిపింది. మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ ఇచ్చిన హెడ్ క్వార్టర్ నిర్వచనం మేరకు షెడ్యూల్ 9 సంస్థల ఆస్తుల విభజనకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ ఇప్పటికే తేల్చి చెప్పింది. అటు ఎంహెచ్‌ఏ కూడా ముందు ఇరుపక్షాలకు అంగీకారం ఉన్న సంస్థల విభజనతో ప్రక్రియ మొదలు పెట్టాల్సిందిగా సూచించింది. ఇందుకు నిరాకరించిన ఎపి మొత్తం ఆస్తుల విభజన ఒకేసారి జరగాలని పట్టుబట్టింది. షెడ్యూల్ 9 ఆస్తుల హెడ్ క్వార్టర్‌తో పాటు ఎక్కడున్నా వాటిని పంచాలన్న డిమాండ్‌ను నిబంధనలకు విరుద్ధంగా ముందుకు తెచ్చింది.

హౌజింగ్, ఆర్టీసిల్లో వాటా కావాలని…..
షెడ్యూల్ 10 సంస్థల విషయంలో జూన్ 2, 2014 నాటికి ఉన్న నగదును పంచుకోవాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం షెడ్యూల్ 10 సంస్థల ఆస్తులు ఎక్కడివి అక్కడే ఉంచి, ఉద్యోగుల విభజన చేసుకోవాల్సి ఉంది. కానీ, ఇక్కడ కూడా ఎపి తన మొండి వైఖరిని ప్రదర్శిస్తూ చట్టానికి అతీతంగా ఆ ఆస్తుల విభజన జరగాలని డిమాండ్ చేస్తోంది. ఇక షెడ్యూల్ 9 లోని దిల్, ఆర్టీసి, హౌజింగ్ కార్పొరేషన్, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లాంటి సంస్థలకు హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వేల కోట్ల ఆస్తులున్నాయి. దిల్ సంస్థకు 5 వేల ఎకరాలుండగా, ఎస్‌ఎఫ్సీకి 400ల ఎకరాలు, హౌజింగ్, ఆర్టీసిలకు రాష్ట్రవ్యాప్తంగా వేల కోట్ల విలువైన భూములు, ఇతర ఆస్తులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటిలో కూడా వాటా కావాలని ఎపి డిమాండ్ చేస్తోంది.

ప్రాజెక్టులపై కేసులు….
వీటితో పాటు కృష్ణా, గోదావరి నదులపై నిర్మిస్తున్న ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పరస్పరం ఆయా బోర్డులకు ఫిర్యాదులు చేశాయి. విభజన చట్టానికి విరుద్ధంగా రాయలసీమ పంపింగ్ స్కీం, పోతిరెడ్డిపాడు కాలువ వెడల్పు పథకాలను ఆంధ్రప్రదేశ్ చేపట్టిందని కృష్ణా బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేసింది. ఈ విషయమై సుప్రీం కోర్టు, తెలంగాణ హైకోర్టులోనూ, హరిత ట్రిబ్యునల్లో తెలంగాణ ప్రభుత్వం కేసు వేసింది. కృష్ణా బోర్డు అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా విభజన చట్టానికి వ్యతిరేకంగా కృష్ణానదిపై పాలమూరు-రంగారెడ్డి, డిండి, భక్త రామదాసు, మిషన్ భగీరథ, తుమ్మిళ్ల ఎత్తిపోతల ప్రాజెక్టులు నిర్మిస్తోందని, గోదావరి నదిపై కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల పథకం, పెన్‌గంగపై నాలుగు ప్రాజెక్టులు మొదలైన వాటిని నిర్మిస్తున్నదని కృష్ణా, గోదావరి బోర్డులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చలు జరిపి నిర్ణయించే వరకు కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టులు నిర్మించవద్దని, కొత్త ప్రాజెక్టులకు డిపిఆర్‌లను సమర్పించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు కృష్ణ గోదావరి బోర్డులు లేఖలు రాశాయి. ఈ సమస్యను అపెక్స్ కౌన్సిల్లో పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాని ఫలితంగా 2016 సెప్టెంబర్ 21న ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. అయినా సమస్య పరిష్కారం కాలేదు.
11వ షెడ్యూల్లోని హంద్రీనీవా, గాలేరు-నగరి….
విభజన చట్టం ప్రకారం 11వ షెడ్యూల్లోని హంద్రీనీవా, గాలేరు-నగరి, వెలుగొండ, తెలుగు గంగా, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులను పూర్తి చేసి వాటికి నీటి కేటాయింపులు చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. పాలమూరు రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల సమస్యను అపెక్స్ కౌన్సిల్లో పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చలు జరిపి ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న నదీ జలాల సమస్యలను అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పరిష్కరించే బాధ్యత కేంద్ర ప్రభుత్వామే తీసుకోవాలని ఇరు రాష్ట్రాల ప్రజలు కోరుతున్నారు.
రాష్ట్రం వెలుపల ఉన్న ఆస్తులు 58:42 నిష్పత్తిలో…
రాష్ట్రం వెలుపల ఆస్తులను 58:42 నిష్పత్తిలో పంచుకోవాలని విభజన చట్టంలో పేర్కొన్న నేపథ్యంలో పంపకాలు జరగాల్సి ఉంది. అదే విధంగా కొన్ని స్థాయిల్లోని ఉద్యోగుల విభజన అంశం సైతం పెండింగ్ లో ఉంది. ఈ సమావేశం ద్వారా ప్రధానంగా నీటి వివాదాల సమస్యకు పరిష్కారం చూపించాలని కేంద్రం భావిస్తోంది. రెండు రాష్ట్రాలు తమకు భవిష్యత్ రాజకీయాల్లో కీలకం కానుండటంతో కేంద్రం తమ బాధ్యతలను పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే, ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలు తమ వాదనలు బలంగా వినిపించేందుకు సిద్దం అవుతున్నాయి.
మూడు బిల్డింగ్‌లపై పట్టువీడని ఎపి….
పంజాగుట్ట, ఎర్రమంజిల్, పాటిగడ్డ, కుందన్ బాగ్, మలక్ పేట్, మాదన్నపేట్లలో ప్రభుత్వ ఉద్యోగుల నివాస గృహాల సముదాయాలు ఉన్నాయి. ఇవికాక అంబర్ పేట పోలీస్ లేన్, మొయినాబాద్‌లో గ్రేహౌండ్స్ క్వార్టర్స్ ఉన్నాయి. అన్నీ కలిపి 700 నుంచి 800ల గృహాలు ఉంటాయని అంచనా. 2019 లో వీటి అప్పగింత కోసం అప్పటి గవర్నర్ నరసింహన్ సమక్షంలో ఒక ప్రయత్నం జరిగినా, అది విఫలం అయింది. వీటితో పాటు హైదరాబాద్‌లోని ముఖ్యమైన 3 బిల్డింగులు ఆంధ్రప్రదేశ్ తన కబ్జాలోనే ఉంచుకుంది. మాసబ్ ట్యాంకులోని సిఐడీ బంగ్లా, ఖైరతాబాద్‌లోని లేక్ వ్యూ గెస్ట్ హౌజ్, ఆదర్శనగర్‌లోని హెరిటైజ్ బిల్డింగ్‌లను అప్పగించడానికి సైతం ఎపి ప్రభుత్వం వెనకాడుతున్నట్టుగా తెలిసింది. విడిపోయి దశాబ్దం గడచినా 2 రాష్ట్రాల మధ్య ఇంకా వివాదాస్పద అంశాలు అనేకం ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో సైతం ఆంధ్రప్రదేశ్ గెస్ట్ హౌజ్ భవనాన్ని, దాని ఆస్తులను ఏకపక్షంగా విభజించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే 06వ తేదీన జరిగే ఇరు రాష్ట్రాల సిఎంల భేటీలో ఈ అంశాలన్నీ చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ లో అడుగు పెట్టె సాహసం చేస్తాడా?
- Advertisment -

Most Popular