కరోనా నియంత్రణ కోసం మరో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. గుజరాత్కు చెందిన ఫార్మా సంస్థ జైడస్ క్యాడిలాకు చెందిన జైకొవ్ – డి టీకా అత్యవసర వినియోగం కోసం భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) ఇవాళ అనుమతి మంజూరు చేసింది. 12 ఏళ్లు దాటినవాళ్ళ కోసం అందుబాటులోకి వచ్చిన తొలి టీకా ఇదే. జైకొవ్ – డి ప్రపంచంలోనే తొలి డీఎన్ఏ ఆధారిత టీకా కూడా కావడం విశేషం.
- ఈ వాక్సిన్ అనుమతుల కోసం జైడస్ క్యాడిలా జులై 1 న దరఖాస్తు చేసుకుంది. నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు ఈ టీకా వినియోగానికి తాజాగా డీసీజీఐ అనుమతించింది. జైకొవ్ – డికి 66.6% సమర్థత ఉన్నట్లు మధ్యంతర పరిశీలనలో తేలింది. 0 – 28 – 56 రోజుల వ్యవధిలో 3 డోసుల్లో ఈ టీకా తీసుకోవాల్సి ఉంటుంది. దేశంలో ఇప్పటికే కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్ – విల పంపిణీ జరుగుతుండగా, అమెరికాకు చెందిన మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ టీకాల వినియోగానికి కూడా కేంద్రం గ్రీన్ సిగ్నలిచ్చింది. ఇప్పుడు ఆ జాబితాలో జైకోవ్ – డి చేరింది. దీంతో దేశంలో అనుమతులు లభించిన వ్యాక్సిన్ల సంఖ్య 6 కు చేరింది.