విశాఖ నగరంలోని వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో 25 ద్విచక్ర వాహనా లను దొంగలించిన నిందితుడిని అరెస్టు చేసినట్టు ఏడీసీపీ క్రైమ్ గంగాధరమ్ తెలిపారు.మహారాణిపేట మంతావారి వీధికి చెందిన బి.సత్య తరుణ్కుమా ర్ జనవరి 28న బీవీకే కాలేజీలో పరీక్ష రాయటానికి వెళ్లారు. అక్కడ తన ద్విచక్రవాహనం పార్కింగ్ చేసి తాళం వేయడం మరిచారు. తిరిగి వచ్చేసరికి తన వాహనం కనిపించలేదు. దీంతో ద్వారకా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద చేపల ఉప్పాడ ప్రాంతానికి చెందిన చినమామ ఎల్లాజీని అదుపులోకి తీసుకొని విచారించారు. నగరంలోని వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో మొత్తం 25 ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్టు నిందితుడు అంగీకరించాడు. అతని వద్ద నుంచి వాహనాలను స్వాధీనం చేసుకొని, అరెస్టు చేశారు.