300 CRORES NECKLACE
- వివాహ కానుకగా అందజేసిన నీతా అంబానీ
ఆయన భారతదేశంలోనే నెంబర్ వన్ కుబేరుడు.. మరి ఆ కుబేరుడి కుటుంబానికి కోడలిగా వెళ్లిన యువతికి ఇచ్చే కానుక ఎంత ఉంటుందో ఊహించగలరా? వివాహం సందర్భంగా అత్తింటివారు కోడలికి బంగారు కానుక ఇవ్వడం సంప్రదాయం. మరి దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులు తమ కోడలికి ఏం కానుక ఇచ్చారో తెలుసా? వజ్రాల నెక్లెస్. అది కూడా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హారం. దాని విలువ ఏకంగా రూ.300 కోట్ల పైమాటే. ఈనెల 9న ముంబైలో ముఖేష్, నీతా అంబానీల కుమారుడు ఆకాష్ అంబానీకి, అతని చిన్నప్పటి స్నేహితురాలు శ్లోకా మెహతాకు అత్యంత వైభవంగా వివాహం జరిగిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా తన కోడలు శ్లోకాకు నీతా అంబానీ పెళ్లి కానుకగా వజ్రాల నెక్లెస్ను బహూకరించారు. మొదట నీతా అంబానీ తమ కుటుంబ వారసత్వంగా వస్తున్న బంగారం హారాన్ని కోడలికి కానుకగా ఇవ్వాలనుకున్నారట. కానీ దానికి భిన్నంగా ప్రపంచంలోనే అత్యంత విలువైన నగను ఎంపిక చేయాలనుకున్నారు. దాంతో వజ్రాలు, పచ్చలు, ఇతర విలువైన రాళ్లు పొదిగిన నెక్లెస్ను ప్రత్యేకంగా డిజైన్ చేయించి శ్లోకా కు కానుకగా ఇచ్చారు. ఇందుకోసం రూ.300 కోట్లు వెచ్చించారు. అంబానీ కుటుంబ ఆస్తితో పోలిస్తే ఇదేమీ వారికి పెద్ద మొత్తం కాదు. అయితే, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగ మాత్రం ఇదే కావడం విశేషం. నిశ్చితార్థం సమయంలోనూ శ్లోకాకు పెద్ద కానుకే అందింది. పూర్తిగా బంగారం పూతతో ప్రత్యేకంగా తయారు చేసిన ఏడు కోట్ల రూపాయల విలువైన కారును ఆకాశ్ తన నిచ్చెలికి కానుక అందజేసి, తన ప్రేమను చాటుకున్నాడు.