AMERICA DEEP FREEZ
- మైనస్ 53 డిగ్రీల ఉష్ణోగ్రతతో గడ్డకట్టుకుపోతున్న ప్రాంతాలు
- చాలా చోట్ల మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రత
ఎముకలు కొరికే చలి ఎలా ఉంటుందో తెలియాలంటే ఇప్పుడు అమెరికా వెళ్లాల్సిందే. ప్రస్తుతం అగ్రరాజ్యం వణికిపోతోంది. మామూలుగానే శీతాకాలంలో చల్లగా ఉండే దేశం ఈసారి ఏకంగా గడ్డ కట్టుకుపోతోంది. పోలార్ వొర్టెక్స్ ప్రభావం కారణంగా ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వీస్తున్న గాలులతో అనేక రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ 53 డిగ్రీలకు పడిపోయాయి. అంటే అక్కడ చలి ఏ విధంగా ఉంటుందో ఊహిస్తేనే భయం కలుగుతోంది. విపరీతమైన చలిగాలులకు అమెరికాలోని పలు ప్రాంతాల్లో ప్రజలు విలవిల్లాడుతున్నారు. అమెరికా పశ్చిమ మధ్య భూభాగం లో అత్యంత చలి కనిపిస్తోంది. ఆరుబయట వాతావరణంలో కొద్దిసేపు ఉన్నా పలు రకాల వైకల్యాలు తలెత్తి ప్రాణాపాయం సైతం కలిగే అవకాశం ఉంది. పలు విమానాలు రద్దు కాగా.. రైళ్లు నడపటానికి కూడా వీలుకావడంలేదు. పట్టాలపై మంచు పేరుకునిపోవడంతో పట్టాలపై మంటలు వేసిన తర్వాత రైళ్లు నడుపుతున్నారు.
భారీ హిమపాతం, చలిగాలులు కారణంగా ఇప్పటివరకు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. సున్నా, అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతాల్లో దాదాపు 9 కోట్ల మంది ప్రజలు ఉండవచ్చని అంచనా. వీరిలో 2.50 కోట్ల మంది మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ గాలుల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. డకోటా, ఉత్తర మిన్నెసోటాలలో మైనస్ 45 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. కాగా, అమెరికాలోని ఈ తీవ్రమైన చలి వాతావరణం.. భారతదేశంపైనా ప్రభావం చూపిస్తోంది. రాజస్థాన్లోని చురులో మైనస్ 1.1 డిగ్రీల సెల్సియస్కు ఉష్ణోగ్రత పడిపోయింది. ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వీస్తున్న చలిగాలులే దీనికి కారణమని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అధికారులు చెబుతున్నారు.