సంగారెడ్డి :మల్లన్న సాగర్ నుంచి కాలువల ద్వారా సింగూర్కు గోదావరి జలాలను తరలిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. దీంతో ఒక్క అందోల్ నియోజకవర్గంలోనే ఒక లక్షా 80 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వబోతున్నామని మంత్రి పేర్కొన్నారు. అందోల్ నియోజకవర్గంలో రేణుక ఎల్లమ్మ ఎత్తిపోతల పథకాన్ని మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, జడ్పీ చైర్మన్ మంజు శ్రీరెడ్డి, కలెక్టర్ శరత్తో పాటు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. ఈ ఎత్తిపోతల ద్వారా 14 గ్రామాలకు సాగునీరు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. సమైక్య రాష్ట్రంలో ముంపు మనది.. పారకం వాళ్లది ఉండేదని గుర్తు చేశారు. మెదక్ జిల్లాకు సింగూరు జలాలను తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని చెప్పారు. తెలంగాణ రావడం వల్లనే మంజీరా జలాలు మెదక్కు వస్తున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరిని సింగూర్ ప్రాజెక్టుకు అనుసంధానం చేసి, అందోల్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని స్పష్టం చేశారు. దీంతో ఈ ప్రాంతం మరో కోనసీమ కాబోతుందన్నారు. సమైక్య రాష్ట్రంలో మంజీరా నదిపై ఒక్క చెక్ డ్యాం నిర్మాణం చేయలేదు. కానీ తెలంగాణలో మంజీరా నదిపై రూ. 122 కోట్లతో 15 చెక్ డ్యామ్లు నిర్మించామని తెలిపారు. మంజీరా నది ఎప్పుడు జలకళతో ఉంటుందని హరీశ్రావు పేర్కొన్నారు.అగ్నిపథ్ స్కీమ్ ప్రకటించి సైనికులను అవమానపరుస్తున్నారని మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. దేశం కోసం పోరాడే సైనికుల పట్ల కిషన్ రెడ్డి మాట్లాడుతున్న తీరు సరిగా లేదని ధ్వజమెత్తారు. ఆర్మీలో కుడా కాంట్రాక్ట్ పద్దతి తెచ్చి దేశాన్ని ప్రమాదంలో పడేస్తున్నారని హరీశ్రావు ఆవేదన వ్యక్తం చేశారు.