ఏపీ, తెలంగాణాపై మాండూస్ ఎఫెక్ట్ కొనసాగుతుండగానే .. ముంచుకొస్తున్న మరో తుఫాను. మాండూస్ తుఫాను ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాలు కురుస్తున్న వర్షాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, మరో తుఫాను ముంచుకొస్తున్న పరిస్థితి ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. ఈసారి ఎక్కడంటే
బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ ప్రాంతంలో ఈ నెల 13వ తేదీన ఏర్పడనున్న ఉపరితల ఆవర్తన ద్రోణి ఆ తర్వాత క్రమంగా బలపడి అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇది ఈ నెల 16వ తేదీ తర్వాత తుఫానుగా మారే అవకాశం కూడా ఉందని ఆదివారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో ఇప్పుడు మరోమారు తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అన్నదాతలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. శ్రీలంకను ఆనుకుని ఉన్న గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం కారణంగా ఈ నెల 16వ తేదీ వరకు రాష్ట్రంలోని డెల్టా జిల్లాలలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మాండూస్ ప్రభావంతో తమిళనాడు, ఏపీ, తెలంగాణాల్లో వర్షాలు
దక్షిణ అండమాన్ ప్రాంతంలో ఏర్పడే ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా డిసెంబర్ 13, 14 తేదీలలో అండమాన్ నికోబార్ లో విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం తమిళనాడులోని మామల్లపురం లో ఆదివారం రాత్రి మాండూస్ తుఫాను తీరం దాటడంతో తమిళనాడు దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా కెవిబిపురం మండలంలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. చెన్నైలో విద్యుత్ కు అంతరాయం ఏర్పడగా, విపరీతంగా వీస్తున్న ఈదురు గాలులు వల్ల భారీ వృక్షాలు వు నేలకొరిగాయి. ఇప్పటివరకు ఈ తుఫాన్ కారణంగా ఐదుగురు మృతి చెందినట్లు సమాచారం.