ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
సిఎం రేవంత్ రెడ్డిపై బిఆర్ఎస్ సోషల్ మీడియా సభ్యులు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, అనుములకి ఎనుములకి తేడా తెలియకుండా మాట్లాడుతున్నారంటూ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్రపురి సొసైటీలో జరిగిన అవినీతికి సిఎం రేవంత్ రెడ్డికి సంబంధం ఏమిటనీ ఆయన ప్రశ్నించారు. ఎప్పుడైనా రేవంత్ సోదరులో మహేందర్ రెడ్డి అనే పేరు విన్నారా..? అని ఆయన ప్రశ్నించారు. నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే ప్రభుత్వానికి ఇవ్వండి, తప్పకుండా వారిపై మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, నిజంగా తప్పు చేస్తే మా కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టదని ఆయన అన్నారు. కానీ, అనవసరంగా కావాలని ఆరోపణలు చేస్తే చూస్తూ ఉరుకోమని, బిఆర్ఎస్కు చిత్తశుద్ధి ఉంటే మీరే కదా గతంలో ప్రభుత్వం ఉంది, మరి ఎందుకు చర్యలు తీసుకోలేదని అని బల్మూరి మండిపడ్డారు. అసలు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నపుడు తాము ఏమి చేయలేదు అన్నట్లు మాట్లాడుతున్నారని, గతంలో మీడియాను, సోషల్ మీడియాను కెసిఆర్ ఎలా అణిచివేశారో అందరికి తెలుసన్నారు.
హుజురాబాద్లో నా ఫోన్ తీసుకొని కేసు పెట్టింది మర్చిపోయారా?
హుజురాబాద్లో నా ఫోన్ తీసుకొని కేసు పెట్టింది మర్చిపోయారా? పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరిన మిర్చి రైతులకు సంకెళ్లు వేసిన సంఘటన అప్పుడే మర్చిపోయారా అని బల్మూరి వెంకట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపుతారని ధర్నా చౌక్ ఎత్తేసినపుడు మాట్లాడని వారు ఇప్పుడు మాట్లాడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంట్లోకి వచ్చి అరెస్ట్లు చేసిన సంఘటనలు మర్చిపోయారా, తాను మాజీ సిఎం కెసిఆర్ పుట్టిన రోజు చేస్తే, ఒక గాడిదకు ఫొటో వేస్తే గడ్డి దొంగతనం జరిగిందని సుమోటోగా కేసులు పెట్టారని, తాను చేసిన కార్యక్రమం ఒక దగ్గరైతే సుమోటోగా రెండు చోట్ల కేసులు పెట్టారన్నారు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లకుండా ఒక అధికారి ఇంటిపై రూమ్లో లాక్ చేసి పెట్టారని ఆయన తెలిపారు. మాది ప్రజా ప్రభుత్వం అని, మీ బిఆర్ఎస్లో కాదు.. తప్పు చేసింది ఎవరైనా ఉరుకొం, కానీ, ఆధారాలతో రండి ఊరికే బురదజల్లే ప్రయత్నం చేస్తే మాత్రం చూస్తూ ఉరుకోమని ఆయన తెలిపారు.
మన ఇద్దరిపై బిఆర్ఎస్ కేసులు పెట్టింది..?
తాము బిఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్లుగా ఉన్నాం, ఏమైనా మాట్లాడొచ్చు అంటే కుదరదని, లేనిపోని ఆరోపణలు చేస్తే ప్రభుత్వం చూస్తూ ఉరుకోదు తనపని తను చేసుకుపోతుందని ఆయన సూచించారు. భజనలు చేయడం మానుకోండి. అనవసరంగా మా సిఎంపై లేనిపోని ఆరోపణలు చేస్తే వదిలిపెట్టమని ఆయన తెలిపారు. క్రిశాంక్ మీరు ఎప్పుడు మా మాదిరిగా చెప్పలేదు. నేను మీడియా ముందు చెబుతున్నా, ఆధారాలు తీసుకొని అమరవీరుల స్థూపం వద్దకు రండి. డిజిపి ఆఫీస్కు వెళ్దాం, ఎవరు తప్పు చేసిన చర్యలు తీసుకుంటారు. క్రిశాంక్ అన్న కాంగ్రెస్లో ఉన్నపుడు ఇద్దరం కలిసి ఉద్యమాలు చేస్తే ఇద్దరిపై కేసులు పెట్టిన విషయం మర్చిపోయారా, అవస్తవాలు చెప్పడం మానుకోండి అంటూ ఆయన హితువు పలికారు. మీరు, కెటిఆర్, కవిత ఆ కుటుంబం మెప్పు పొందలనుకుంటే బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగకపోయినా జరిగిందని చెప్పుకోండి. మీకు కావాల్సిన ఎమ్మెల్యే టికెట్ కోసం ఇలా మా ప్రభుత్వంపై అవస్తవాలు మాట్లాడడం మానుకోవాలని ఆయన సూచించారు.