హైదరాబాద్: జులై 15వ తేదీ నుండి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘‘రెవెన్యూ సదస్సులో’’ పోడురైతులకు హక్కు పత్రాలు ఇచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని, పోడుభూముల సమస్య కేవలం రెవెన్యూ శాఖకే పరిమితమైంది కాదు, అటవీ శాఖతో కూడా ఈ సమస్య ముడిపడి ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రెవెన్యూ సందస్సులో అటవీ శాఖను కూడా భాగస్వామ్యం చేయాలని బిజెపి రాష్ట్ర అద్యక్షులు బండి సంజయ్ కుమార్ విజ్ఞప్తి చేసారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కు తెలంగాణ శాఖ తరుపున లేఖ రాసారు.
బిజెపి తెలంగాణశాఖ, బిజెపి ఎస్టీ మోర్చా, మా పార్టీకి చెందిన సీనియర్నాయకుడు ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు సోయం బాబురావుగారు పోడురైతులకు హక్కుపత్రాలివ్వాలని జిల్లా కలెక్టర్లకు, సంబంధిత అధికారులకు అనేక వినతిపత్రాలు ఇవ్వడంతోపాటు, అనేక ఆందోళనకార్యక్రమాలు కూడా చేపట్టిన విషయం మీకు దృష్టికి వచ్చే ఉంటుంది. బిజెపి చేసిన పోరాటాలకు తల వొగ్గి రాష్ట్రప్రభుత్వం పోడుభూముల పట్టాలకోసం ధరఖాస్తులు స్వీకరించే కార్యక్రమానికి నవంబర్ 2021 లో శ్రీకారం చుట్టిన విషయం మీకు విధితమే. అయితే ఈ సమస్యకు పూర్తి పరిష్కారం లభించలేదని పేర్కొన్నారు.పోడుభూముల సమస్య పరిష్కారానికి వివిధ సందర్భాల్లో మీరు ఇచ్చిన హామీని, ప్రకటనలను గుర్తుచేయదలుచుకున్నాం. రాష్ట్రయంత్రాంగాన్ని అంతా తీసుకుని వచ్చి గిరిజనులకు పట్టాలిచ్చే కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తానని 2019 జులైలో మీరు హామీ ఇచ్చారు, నవంబర్ 23, 2018న మహబూబాబాద్ బహిరంగసభలో అవసరమైతే కుర్చీవేసుకుని మరీ పోడురైతులకు పట్టాలు అందజేస్తామని మీరు ప్రకటించిన విషయం మీకు గుర్తు ఉండకపోవచ్చు. మర్చిపోయిన ఈ విషయాలను కావాలంటే అప్పట్లో వచ్చిన మీడియాలో వార్తలను మీకు పంపుతాము. మీరు కుర్చీవేసుకుని గిరిజనులకు, ఆదివాసీలకు పట్టాలు ఇప్పించడానికి సిద్ధమైతే బిజెపి తెలంగాణ శాఖ, గిరిజనులు, ఆదివాసీలు మీకు కుర్చీలు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు.గిరిజనులకు పట్టాలిచ్చే కార్యక్రమాన్ని స్వయంగా మీరు పర్యవేక్షించకపోయినా, కుర్చీవేసుకుని పట్టాలు ఇప్పించకపోయినా పర్వాలేదు, కనీసం జులై 15 వ తేదీ నుండి నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో పోడురైతులకు హక్కుపత్రాలు ఇచ్చేవిధంగా చర్యలు తీసుకుంటే అదే పదివేలు, ఈ చర్య గిరిజనులు, ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపుతుంది. రెవెన్యూ సదస్సుల్లో పోడురైతులకు హక్కుపత్రాలు ఇచ్చి గిరిజనులు, ఆదివాసీల సంక్షేమం పట్ల మీకు వున్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు.పోడుభూముల సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర గిరిజనశాఖా మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు చైర్మన్గా, అటవీ, రెవెన్యూశాఖా మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటి ఉత్సవ విగ్రహంగా మిగిలిపోయింది. రాష్ట్రప్రభుత్వం 8 నవంబర్ 2021 నుండి 8 డిసెంబర్ 2021 వరకు పోడుసాగుదారులనుండి ధరఖాస్తులు స్వీకరించిన విషయం మీకు విధితమే. మాకున్న సమాచారం ప్రకారం పోడుభూముల పట్టాలు ఇవ్వాలని కోరుతూ గిరిజనులు, ఆదివాసీలు దాదాపు మూడున్నర లక్షల మంది ధరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రప్రభుత్వం ఇప్పటివరకు ఎంతమంది గిరిజనులు, ఆదివాసీలు పోడుభూముల పట్టాలకోసం ధరఖాస్తు చేశారో రహస్యంగా ఉంచుతోంది. గిరిజనులు, ఆదివాసీల నుండి పట్టాల కోసం ధరఖాస్తులు స్వీకరించి ఏడు నెలలు మించిపోయినా ఇప్పటివరకు వాటికి అతీగతీ లేదు. గ్రామసభల ద్వారా స్వీకరించిన ధరఖాస్తులను పరిశీలించడానికి ఇంకా ఎంత సమయం కావాలని ప్రశ్నించారు.కేంద్ర అటవీ హక్కుల చట్టం ప్రకారం అడవిపై, అటవీ ఫలాలపై, పోడుభూములపై గిరిజనులకు పూర్తిహక్కులున్నాయి. చట్టపరంగానే గిరిజనులకు ఉన్న హక్కులను ప్రభుత్వం కాలరాయడం క్షమించరాని నేరం. పోడుభూములకు పట్టాలకోసం ఒకవైపు ఆందోళనలు జరుగుతుండగా మరోవైపు పోడుభూముల్లో హరితహారానికి ఫారెస్ట్ అధికారులు సన్నాహం చేయడం గర్హనీయం. ప్రభుత్వ చర్యల వలన గిరిజన ప్రాంతాల్లో ఘర్షణలు చోటుచేసుకునే ప్రమాదం ఉంది. ప్రభుత్వం చేపట్టిన ఇటువంటి చర్యలవల్ల గిరిజనులకు, ఫారెస్టు అధికారుల మధ్య ఘర్షణలు తలెత్తుతున్నాయి. గిరిజనులపై అక్రమ కేసులు బనాయించి ప్రభుత్వం జైలుకు పంపుతోంది. ఆదివాసులు, గిరిజనులు అడవికి హక్కుదారులు. పోడుభూముల జోలికి ప్రభుత్వం వస్తే వారు సహించరన్నారు.రాష్ట్రప్రభుత్వం పోడుభూములు సాగుదారులనుండి ఎన్ని లక్షల ఎకరాలపై, ఎంత మంది ధరఖాస్తు చేసుకున్నారో జిల్లాలు, మండలాలు, గ్రామాలవారీగా జాబితాను రెవెన్యూ సదస్సుల కన్నా ముందే ప్రకటించాలని, ఈ ధరఖాస్తులను రెవెన్యూ సదస్సులో పరిశీలించి హక్కుపత్రాలు ఇవ్వాలని, పోడుభూముల్లో హరితహారం కార్యక్రమాన్ని విరమించుకోవాలని, రెవెన్యూ సదస్సులో పోడుభూముల సమస్య పరిష్కారం కోసం అటవీశాఖను కూడా భాగస్వామ్యం చేయాలి, పోడుభూముల సమస్య పరిష్కారం అయ్యేవరకు అటవీ, పోలీస్, రెవెన్యూశాఖల అధికారులు జోక్యం చేసుకోకూడదని, దాడులను నిలిపివేయాలని, పోడుభూముల సమస్యపై పోరాడుతున్న గిరిజనులు, ఆదివాసీలపై బనాయించిన తప్పుడు కేసులను ఉపసంహిరించుకోవాలని కోరుతున్నామన్నారు.మీరు సత్వరమే స్పందించి పోడుభూముల సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని పోడుభూముల సమస్య పరిష్కారంలో ఆలస్యం జరిగితే సమస్య మరింత జటిలమౌతుందని పేర్కొన్నారు.