BOMB BLASTS IN PHILIPPINES
- చర్చి లక్ష్యంగా పేట్రేగిన ఉగ్రవాదులు
- 27 మంది మృతి.. 77 మందికి గాయాలు
ఫిలిప్పీన్స్ లో ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించారు. బాంబులతో విరుచుకుపడ్డారు. ఓ చర్చిని లక్ష్యంగా చేసుకుని బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ పేలుళ్లలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 77 మంది గాయపడ్డారు. దక్షిణ ఫిలిప్పీన్స్ ప్రాంతంలోని రోమన్ కాథలిక్ కాథడ్రల్ చర్చిలో రెండు పేలుళ్లు జరిగాయి. ముస్లిం మిలిటెంట్ల ప్రభావం ఎక్కువగా ఉండే జోలో ప్రాంతంలోని కాథడ్రల్ చర్చికి సమీపంలో మొదటగా బాంబు పేలుడు చోటుచేసుకుంది. అనంతరం చర్చి ఆవరణలో మరో బాంబు పేల్చారు. పేలుళ్ల ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయి ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. పేలుళ్లలో గాయపడనివారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. పేలుళ్ల నేపథ్యంలో ఫిలిప్సీన్స్ ప్రభుత్వం వెంటనే భద్రతా చర్యలు చేపట్టింది. అన్ని ప్రాంతాల్లో భద్రత పెంచాలని.. ప్రార్థనాస్థలాలు, బహిరంగ ప్రదేశాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించింది. జోలో ద్వీపంలో అబు సయ్యఫ్ సంస్థ మిలిటెంట్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గత కొంత కాలంగా ఈ ఉగ్రవాద సంస్థ ఆ ప్రాంతంలో బాంబు పేలుళ్లు, హత్యలతో మారణహోమం పాల్పడుతోంది.