Data Theft Case Solved Due to Election
డేటా చోరీ కేసు సద్దుమణిగినట్టే అనిపిస్తుంది .. తెలుగు రాష్ట్రాల మధ్య యుద్ధానికి కారణమైన ఈ వివాదం ఇప్పుడు సైలెన్స్ అయిపోయింది. తెలుగుదేశం పార్టీ సేవా మిత్రయాప్ పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించి దుర్వినియోగం చేసిందని వైసీపీ ఫిర్యాదు చేయడం.. తెలంగాణ ప్రభుత్వం టేకప్ చేసి ఐటీ గ్రిడ్స్ సంస్థపై దాడులు చేయడం వివాదాస్పదమైంది. ఈ వివాదం పీక్ స్టేజ్ కు పోయి ఏపీ – తెలంగాణ ప్రభుత్వాల మధ్య యుద్ధానికి కారణమైంది.
ఒకే ఒక్క ప్రకటనతో అంతా చప్పున చల్లారింది. ఇప్పుడెవరు డేటా చోరీ అనడం లేదు. చంద్రబాబు మరిచిపోయాడు.. తెలంగాణ సర్కారు తన దృష్టి మరల్చింది. దీనికి అంతటికి కారణం ఒకటే.. అదే సార్వత్రిక ఎన్నికల ప్రకటన.. అవును.. ఇప్పుడు ఏపీ – తెలంగాణ ప్రజలు ‘డేటాచోరీ’ కేసును మరిచిపోయారు. ఎన్నికల వేడి రాజుకుంది.. ఎవరు ఏ పార్టీలో ఉంటారు.? ఎవరికి ఏ సీటు దక్కుతుందని.. ఏపీలో అధికారంలోకి వచ్చేది ఎవరనే ఆసక్తి నెలకొంది. అధికార టీడీపీ కూడా ఎన్నికల నగారా మోగటంతో ఇక అభ్యర్థులను ఏర్చికూర్చి ఎన్నికల బరిలో దిగడానికి రెడీ అయ్యింది. డేటా చోరీ గురించి చంద్రబాబు స్పందించడం లేదు.. ఆపార్టీ నేతలూ వల్లెవేయడం లేదు. అంతా సీట్లు – ఫీట్లు – పొత్తుల చుట్టూనే రాజకీయం నడుస్తోంది. చంద్రబాబు డేటా చోరీ ఆరోపణలకు కేసీఆర్ బదులిస్తారని అంతా అనుకున్నారు. కానీ ఆయన స్పందించలేదు. ఇప్పుడు కేంద్రం – టీఆర్ ఎస్ ఫోకస్ అంతా ఏపీపైనే పెట్టారు. డేటా చోరీ పక్కకు పోయి చంద్రబాబును ఓడించేందుకు వైరి వర్గాలు ఏకమయ్యాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అలా ఉవ్వెత్తున ఎగిసి ఇప్పుడు వార్తల్లో లేకుండా పోయింది డేటా చోరీ కేసు.