- ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సిఎం రేవంత్ విజ్ఞప్తి…
- విపత్తు పరిశీలనకు రావాలని విన్నపం…
- మరణించిన వారి కుటుంబాలకు పరిహారం రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు…
- పాడి పశువులకు రూ.30 వేల నుంచి రూ.50 వేలు, మేకలు, గొర్రెలకు రూ.3 వేల నుంచి రూ.5 వేలకు పెంపు
- తక్షణ సహాయ చర్యలకు ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్లకు రూ.5 కోట్లు
- ఎన్డీఆర్ఎఫ్ తరహాలో పోలీసు సిబ్బందికి శిక్షణ
- భారీ వర్షాలపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు నిర్ణయాలు
భారీ వర్షాలతో పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం, లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినందున జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రాణ, పంట నష్టాలతో పాటు భారీగా ఆస్తి నష్టం వాటిల్లినందున స్వయంగా పరిశీలనకు రావాలని ప్రధానమంత్రిని కోరుతూ లేఖ రాయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ముఖ్యమంత్రి ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో నాలుగు జిల్లాల్లో ఏర్పడిన వరదలపై హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ రూంలో ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం సమీక్ష నిర్వహించారు. అతి తక్కువ సమయంలో ఇంత భారీ వర్షాలు కురవడానికి కారణాలు, రెండు రోజుల పరిస్థితుల గురించి వాతావరణ శాఖ అధికారులను సిఎం రేవంత్ అడిగి తెలుసుకున్నారు. ఊహించిన దానికన్నా ఎక్కవ వర్షాలు వచ్చాయని, గతంలో అయిదేళ్లకో, పదేళ్లకో ఇలా వచ్చేవని ఇటీవల తరచూ వస్తున్నాయని, దీనిపై మరింత అధ్యయనాలు జరుగుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు సిఎం రేవంత్తో తెలిపారు.
ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా ఈ రెండురోజులు ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సిఎంతో తెలిపారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, అన్ని విభాగల అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అవసరమైతే వెంటనే సహాయక శిబిరాలకు తరలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి 24 గంటలు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి సూచించారు. చెరువులు, కల్వర్టులు, లో లెవల్ కాజ్వేలు ఇతర ప్రదేశాల్లో వివిధ శాఖల అధికారులతో పర్యవేక్షణ చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వాతావరణ పరిస్థితులపై ప్రతి మూడు గంటలకో బులెటిన్ విడుదల చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
పరిహారం పెంపు ఇలా…
వర్షాలు, వరదలతో చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలకు, పాడి పశువులకు ఇచ్చే పరిహారం రూ.30 వేల నుంచి రూ.50 వేలకు, మేకలు, గొర్రెలకు రూ.3 వేల నుంచి రూ.5 వేలకు పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే వరద ప్రభావిత జిల్లాలు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట కలెక్టరేట్లకు తక్షణ సాయం కింద రూ. 5 కోట్లను సిఎం మంజూరు చేశారు. పంట నష్టం గురించి అధికారులు అంచనా వేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ అధికారులను ఆదేశించారు.
ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.లక్షన్నర ఎకరాలకుపైగా పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయ అధికారులు సిఎంతో తెలిపారు. 4 లక్షలకుపైగా ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వార్తలు వస్తున్నాయని, తక్షణమే రంగంలోకి దిగి పంట నష్టం వివరాలు సేకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కామారెడ్డిలో వరదలు వచ్చినప్పుడు పంటనష్ట పరిహారం వెంటనే విడుదల చేశామని, ప్రస్తుతం అలా చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆయా వివరాలను సమగ్రంగా పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వ బృం దాలు సైతం తక్షణమే పంట నష్ట పరిశీలనకు వచ్చే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
ఇళ్లు కూలిపోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు
ఇళ్లు కూలిపోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రైల్వే లైన్ సైతం కొట్టుకుపోవడం, పదుల సంఖ్యలో రోడ్లు, చెరువులకు గండిపడడం, విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, ఇతర ఆస్తి నష్టాలు చోటు చేసుకున్నందున స్వయంగా ప్రధానమంత్రిని పర్యటనకు రావాలని కోరుతూ లేఖ రాయాలని సిఎస్కు ముఖ్యమంత్రి సూచించారు.
టిజిడిఆర్ఎఫ్ ఏర్పాటుకు సిఎం సుముఖం
భవిష్యత్లో ఇలాంటి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కునేందుకు తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (టిజిడిఆర్ఎఫ్) ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. 25 పెద్ద టవర్లు కూలిపోయినప్పటికీ విద్యుత్ సిబ్బంది వెంటనే కరెంట్ సరఫరాను పునరుద్ధరించారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అదే విధంగా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ సమస్యలు, ప్రమాదాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సిఎం ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని గుర్తించి తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించి నష్టాలను నివారించాలని సిఎం సూచించారు. వాగులు, వంకలు పొర్లుతున్న దృష్ట్యా దెబ్బతిన్న రోడ్లు, వరద ప్రవహిస్తున్న రోడ్లపై నుంచి ఎవరూ దాటే ప్రయత్నం చేయవద్దని ముఖ్యమంత్రి హెచ్చరించారు. రెవెన్యూ, పోలీసు, ఇతర విభాగాల అధికారులు బృందాలు ఏర్పడి అన్ని చోట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు.
యువ పోలీసులకు ఎన్డీఆర్ఎఫ్ తరహాలో శిక్షణ…
రాష్ట్రంలోని 8 బెటాలియన్లలో మూడో వంతు యువ పోలీసులకు ఎన్డీఆర్ఎఫ్ తరహాలో శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిజిపిని ఆదేశించారు. భారీ వర్షాలు, వరదల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ నుంచి తక్షణ సాయం ఎందుకు అందడం లేదని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. మనం పెట్టిన ఇండెంట్ ఆధారంగా వాళ్ల దగ్గర ఉన్న బలగాలను పంపుతారని, ఇందుకు సమయం పడుతుందని అధికారులు బదులిచ్చారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి మన బెటాలియన్లలోని యువ పోలీసులకు ఎన్డీఆర్ఎఫ్ తరహాలో శిక్షణ ఇవ్వాలని సిఎం ఆదేశించారు. పరికరాల సమస్య ఉందని అధికారులు సిఎంతో పేర్కొనగా, ఎంత ఖర్చయినా ఫర్వాలేదని, వెంటనే పరికరాలను కొనుగోలు చేయాలని సిఎం అధికారులకు సూచించారు. ఒడిశా, గుజరాత్లో అలా శిక్షణ ఇచ్చి బృందాలు ఏర్పాటు చేసుకున్నాయని అధికారులు తెలపగా, అవసరమైతే అక్కడి విధానాలను కూడా అధ్యయనం చేయాలని, అక్కడ అనుభవం ఉన్నవారితో శిక్షణ ఇప్పించాలని సిఎం సూచించారు. దానికోసం ఒక మాన్యువల్ రూపొందించాలని, ప్రతి సీజన్ ముందు శిక్షణ ఇప్పించిన సిబ్బందితో రిహార్సల్స్ చేయించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
జీహెచ్ఎంసీ.. కమిషనరేట్ల పరిధిలో…
నగరంలో ఎక్కడా చిన్న అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోవడానికి వీల్లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యుత్, ట్రాఫిక్, త్రాగునీరు, శానిటేషన్ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని సిఎం రేవంత్ సూచించారు. ట్రాఫిక్ను నిరంతరం పర్యవేక్షించాలని, విద్యుత్ సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయ శిబిరాలను తరలించాలని సిఎం సూచించారు. నిత్యం పనికి వెళ్లే కూలీలు పనులు ఉండక ఇంటి దగ్గరే ఉండిపోతారని, వారిని గుర్తించి బియ్యం, పప్పులు, నిత్యావసర సరకులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమీక్షలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేంద్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపి అనిల్ కుమార్ యాదవ్, సిఎస్ శాంతి కుమారి, డిజిపి జితేందర్, అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రూ. 2 వేల కోట్లు కేటాయించాలి…
సోమవారం ఉదయం హైదరాబాద్లో అధికారులతో సమీక్ష అనంతరం వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు సిఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు వెళ్లారు. ముందుగా సిఎం సూర్యాపేట జిల్లా మోతె గ్రామంలో పర్యటించారు. సూర్యాపేట జిల్లాలో వరదల కారణంగా జరిగిన పంట, ఆస్తి నష్టంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జున సాగర్ ఎడమ కాల్వ తెగిపోవడం వల్ల జరిగిన పంట నష్టం గురించి అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు.
వరద నష్టం రూ.5 వేల కోట్లు
రాష్ట్రంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు, వరదలతో ఇప్పటివరకు రూ. 5 వేల కోట్ల మేర నష్టం జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసినట్టు సిఎం రేవంత్ వెల్లడించారు. తక్షణం కేంద్ర ప్రభుత్వం రూ. 2 వేల కోట్లను కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఎవరూ అధైర్య పడవద్దు: పాలేరులో సిఎం
మున్నేరు వరదల కారణంగా నష్టపోయిన బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, ఎవరూ అధైర్య పడవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. తక్షణ సాయం కింద ప్రతి కుటుంబానికి రూ.పది వేలు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. సూర్యాపేట నుంచి సిఎం రేవంత్ పాలేరు నియోజకవర్గంలోని నాయకన్గూడెం చేరుకున్నారు. అక్కడ డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపి రఘురామ్ రెడ్డి, ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్ బాబు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాయకన్ గూడెం వద్ద దెబ్బతిన్న పాలేరు రిజర్వాయర్ అలుగులను, దెబ్బతిన్న రహదారులను, పంటపొలాలను సిఎం రేవంత్ పరిశీలించారు. రిజర్వాయర్ వద్దకు చేరుకుని కొతకు గురైన కాల్వను, మినీ హైడల్ ప్రాజెక్టును రేవంత్ పరిశీలించారు. అనంతరం కూసుమంచి మీదుగా ఖమ్మం చేరుకుని పోలేపల్లిలోని రాజీవ్ గృహకల్ప, ఖమ్మంలోని బొక్కలగడ్డ, మోతేనగర్ లో సిఎం పర్యటించి బాధితులను ఓదార్చారు. ప్రభుత్వం సహాయ,సహకారాలు అందిస్తుందని, ధైర్యంగా ఉండాలని సిఎం వారికి ధైర్యం చెప్పారు.
ఇంటింటికీ వెళ్లి నష్టాన్ని అంచనా వేయాలి
ఖమ్మం జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో సిఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రాణ, ఆస్తి నష్టానికి ఆర్థిక సాయం ప్రకటించారు. పాడిపశువులు, గొర్రెలు, మేకలు నష్టపోయిన వారికి ఆర్థికసాయం చేయనున్నట్లు సిఎం తెలిపారు. వరదల్లో ధ్రువపత్రాలు పోగొట్టుకున్న వారికి మళ్లీ ఒరిజినల్స్ ఇస్తామని సిఎం రేవంత్ వెల్లడించారు. రెవెన్యూ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి నష్టాన్ని అంచనా వేయాలని రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించే ముందు సిఎం రేవంత్ పాలేరు రిజర్వాయర్ను పరిశీలించారు. కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ వద్ద ఎన్ఎస్పీ కాలువకు గండి పడటంతో పొలాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో ఆయన పంట పొలా లను పరిశీలించారు. అలాగే వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన సాగర్ ఎడమ కాలువ, నాయకన్గూడెం దగ్గర దెబ్బతిన్న రోడ్డు, పాలేరు ఏరును మంత్రులతో కలిసి పరిశీలించిన అనంతరం ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాలకు సిఎం వెళ్లారు. ఖమ్మంలో మంత్రులు, అధికారులతో సిఎం సమీక్ష చేశారు.
రాత్రికి ఖమ్మంలోనే సిఎం బస
సోమవారం ఉదయం హైదరాబాద్లో అధికారులతో సమీక్ష అనంతరం వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు సిఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు వెళ్లారు. రోడ్డు మార్గంలో ఆయన సూర్యాపేట మీదుగా ఖమ్మం జిల్లాకు వెళ్లారు. అక్కడ వరద ప్రభావిత ప్రాంతాలను సిఎం పరిశీలించారు. సోమవారం రాత్రి ఖమ్మంలోనే సిఎం బస చేయనున్నారు. నేడు మహబూబాబాద్, వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు.