Dogs Killed Old Women
ఆ గ్రామంలో కుక్కలు క్రూరత్వాన్ని చూపించాయి. బ్రతికున్న వృద్ధురాలి ప్రాణం తీశాయి. ఆటవిక చర్య కు పాల్పడ్డాయి. కుక్కల్ని చూస్తేనే భయపడి పారిపోయేలా చేశాయి. అత్యంత పాశవికంగా వృద్ధురాలిని ఈడ్చుకెళ్లి పీక్కు తిన్నాయి. ఒక నిండు ప్రాణాన్ని కబళించి వేశాయి…
శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఈ దారుణం అందర్నీ విస్మయానికి , అంతే బాధకు గురి చేసింది . శ్రీకాకుళం జిల్లా వంగర మండలం శ్రీహరిపురంలో సజీవంగా ఉన్నవృద్ధురాలిని కుక్కులు ఈడ్చుకువెళ్లి పీక్కు తిన్నాయి. శ్రీహరిపురానికి చెందిన అంపిల్లి రాముడమ్మ (65)అనే వృద్ధురాలు మంగళవారం రాత్రి ఇంటి ఆరుబయట అరుగుపై నిద్రించింది. అర్ధరాత్రి 2గంటల సమయంలో ఆ వీధిలోకి వచ్చిన సుమారు 10 కుక్కల గుంపు ఆవృద్ధురాలిని ఈడ్చుకు వెళ్ళాయి. కుక్కలు ఈడ్చుకు వెళ్తున్నప్పుడు బాధతో వృద్ధురాలు కేకలు వేసింది. అర్ధరాత్రి సమయం అవటంతో, జనాలు వచ్చే లోపు ఆమెపై కుక్కలు దాడి చేసి పీక్కుతిన్నాయి. మెడపై , ఒంటిపై, కాళ్లపై ,తీవ్ర గాయాలపాలైన ఆమెను ఆసుపత్రికి తరలించేలోపే మరణించింది. గతంలో కూడా శ్రీహరిపురంలో ఇలాంటి ఘటనే జరిగింది. పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం వల్లే మళ్లీ కుక్కలు దాడి చేశాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
ఇప్పటికైనా గ్రామస్థుల ప్రాణాలు హరిస్తున్న కుక్కలను పట్టుకెళ్ళాలని పంచాయతీ అధికారులను గ్రామస్తులు కోరుతున్నారు. ఇప్పటికీ ఇలాంటి ఘటన జరగడం రెండోసారి కావడంతో భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గ్రామస్తులు అంటున్నారు. ప్రాణాలు పోతున్నా పట్టించుకోని అధికారుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కుక్కల నుండి మమ్మల్ని కాపాడండి బాబోయ్ అంటూ మొరపెట్టుకుంటున్నారు.