పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇలాంటి సమయంలో భారత్కి అనుకూలంగా కొందరు.. పాక్కి అనుకూలంగా మరికొందరు సోషల్ మీడియాలో పోస్టులను పెడుతున్నారు. తాజాగా టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత పెట్టిన పోస్ట్ వైరల్గా మారింది. ఈ ట్వీట్ పాకిస్తాన్కి అనుకూలంగా ఉందంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. సింధూ జలాల అంశాన్ని హైలెట్ చేస్తూ ” “సముద్రాలు.. నీళ్లు తాగలేవు, చెట్లు తమ పండించిన పండ్లు తినలేవు, సూర్యుడు తన కాంతిని చూడలేడు, పువ్వులు తమ పరిమళాన్ని ఆస్వాదించలేవు, ప్రకృతి కోసం జీవించండి, మనమందరం కూడా ఒకరికి ఒకరు సాయం చేసుకోవడానికే భూమి మీద పుట్టాము, నీ కోసం జీవిస్తే, ఆనందంగా ఉంటావు, అందరి కోసం జీవిస్తే ఇంకా ఆనందంగా ఉంటావు” అనే అర్ధం వచ్చేలా సమంత పోస్ట్ చేసింది. సింధు జలాలను పాక్కు వెళ్లకుండా భారత్ నిలిపి వేసిన సమయంలోనే సమంత ఈ పోస్ట్ షేర్ చేయడం సోషల్ మీడియా అంతటా వైరల్గా మారింది. కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదుల దాడి ఘటనలో 27 మంది అమాయక పర్యాటకుల రక్తం నేలపై చిందింది. దీని వెనుక పాకిస్థాన్ హస్తం ఉన్నట్టు భారత ప్రభుత్వం గట్టిగా నమ్ముతుంది. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దేశంలో ఉన్న పాక్ పౌరులను స్వదేశానికి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో సింధు జలాల ఒప్పందాలను రద్దు చేసి.. నీటి ప్రవాహాలను ఆపేసింది. ఇటువంటి సమయంలోనే సమంత షేర్ చేసిన ఈ పోస్ట్ ఆసక్తికరంగా మారింది.