ENCOUNTER IN KASMIR
- మేజర్, ముగ్గురు జవాన్ల వీరమరణం
కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. గాలింపు జరుపుతున్న భద్రతా దళాలపై ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో మేజర్ తోపాటు ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. పుల్వామా జిల్లాలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో 42 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పయిన సంగతి తెలిసిందే. దీంతో ఉగ్రవాదులను ఏరి పారేసేందుకు భద్రతా బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. ఉగ్రవాదులు ఉన్న ప్రాంతంలోకి చొచ్చుకెళ్లాయి. పింగ్లాన్ ప్రాంతంలో కొందరు ఉగ్రవాదులు నక్కి ఉన్నరన్న సమాచారం మేరకు సోమవారం తెల్లవారుజామున దళాలు రంగంలోకి దిగాయి. సైన్యానికి చెందిన 55 రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్పీఎఫ్, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలింపు చర్యలు చేపట్టాయి. అదే సమయంలో కొందరు ఉగ్రవాదులను గుర్తించి లొంగిపొమ్మని హెచ్చరికలు జారీ చేశాయి. కానీ ముష్కరులు హఠాత్తుగా కాల్పులు మొదలుపెట్టారు. దీంతో ముగ్గురు జవాన్లతో సహా ఒక మేజర్ ప్రాణాలు కోల్పోయారు. దీంతో అప్రమత్తమైన దళాలు ఉగ్రవాదులపైకి ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఇరు పక్షాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక పౌరుడు కూడా మృతి చెందాడు.