ఈ నెల 4వ తేదీన తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కూడా మీడియాకు లీకులిచ్చారు. కానీ కాంగ్రెస్ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో.. మంత్రివర్గ విస్తరణ వాయిదా పడినట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్ష పదవి ఎంపిక కూడా వాయిదా పడినట్లు సమాచారం. కాంగ్రెస్ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన తర్వాతనే కేబినెట్ విస్తరణ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. వారం రోజుల తర్వాత మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఈ భేటీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీల సమక్షంలో జరిగింది. నేతల అభిప్రాయాలను అధిష్ఠానం అడిగి తెలుసుకుంది. పీసీసీ అధ్యక్ష నియామకంలో బీసీలకు అవకాశం కల్పించాలని ఒక అభిప్రాయానికి వచ్చినప్పటికీ, ఎవరికి ఇవ్వాలో నిర్ణయం తీసుకోలేకపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవడం కంటే కొంత సమయం వేచి చూసి ఆ తరువాత చర్చించడం మంచిదని అగ్ర నేతలు అభిప్రాయపడినట్లు సమాచారం. ఇక మంత్రివర్గంలో చోటు కల్పించాల్సిన ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో కేబినెట్ విస్తరణ కూడా తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సమాచారం.