రేవంత్కు విదేశీ టూర్ దెబ్బ
తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల సహాయసహకారాలు అందజేస్తామని మాట ఇచ్చినప్పటికీ, ఫాక్స్కాన్ సంస్థ తన విద్యుత్ వాహన విడిభాగాల తయారీ ప్లాంటును కర్ణాటకలో నెలకొల్పడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్రపంచంలో అతిపెద్ద ఐఫోన్ తయారీదారు ఫాక్స్కాన్, తను కొత్తగా తయారుచేయబోయే ఎలక్ట్రిక్ వాహన యంత్ర విడిభాగాల తయారీ, అసెంబ్లీ యూనిట్ను ఏర్పాటు చేయడానికి కర్ణాటకను ఎంపిక చేసుకుంది. ప్రాజెక్ట్ చీతా పేరుతో నెలకొల్పబోయే ఈ ప్లాంట్ చైనా ప్లాంట్ తర్వాత అతి పెద్దది. తైవాన్ కంపెనీ హోన్ హయ్ టెక్నాలజీ గ్రూప్కు చెందిన ఫాక్స్కాన్, దొడ్డబళ్లాపూర్లో రూ.25వేల కోట్లతో ఈ ప్లాంట్ నెలకొల్పనుంది. ఫాక్స్కాన్ ఛైర్మన్ యూంగ్ లియూతో చర్చల అనంతరం, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాట్లాడుతూ, ప్రభుత్వం ఫాక్స్కాన్కు పూర్తి సహాయసహకారాలు అందజేస్తుందని, నీరు, విద్యుత్, రహదారుల దగ్గర్నుంచీ న్యాయసేవలు కూడా అందిస్తామని ఆయన స్పష్టం చేసారు. బెంగళూరు రూరల్ జిల్లాలోని దేవనహళ్లి తాలూకా, దొడ్డబళ్లాపూర్ ఐటీఐఆర్ ప్రారిశ్రామిక ప్రాంతంలో ఫాక్స్కాన్కు 300 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ ప్రాజెక్ట్ వల్ల 50 వేల ఉద్యోగాలు వస్తాయని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలిపారు.
చైనా ఫ్లాంట్ తర్వాత అతిపెద్దది బెంగుళూరులోనే
సీఎం సిద్ధరామయ్యతో సమావేశం అనంతరం ఫాక్స్కాన్ ఛైర్మన్ యూంగ్ లియూ మాట్లాడుతూ, త్వరలో ఈ ప్లాంట్, చైనాలోని ప్లాంట్ తర్వాత అతిపెద్దదిగా మారబోతోందని, దాదాపు 40వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పిస్తుందని తెలిపారు. అవి కూడా ప్రత్యేకించి మధ్యస్తంగా చదువుకున్నవారికేనని చెప్పిన లియూ, ఇది ఇక్కడితో ఆగదని, తాము మరిన్నిరంగాల్లోకి విస్తరించడానికి ప్రణాళికలు రచిస్తున్నామని, పరస్పర విశ్వాసముంటే ఏదైనా సాధించవచ్చని ఆయన ధీమా వ్యక్తం చేసారు. ఫాక్స్కాన్కు ఇదివరకే దొడ్డబళ్లాపూర్లో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ పేరుతో 300 ఎకరాల విస్తీర్ణంలో ఒక ప్లాంట్ ఉంది. దాని తర్వాత ఇది రెండోది. ఈ రోజు ఫాక్స్కాన్ ప్రతినిధులు తమ ప్లాంట్ను సందర్శించే అవకాశముంది. అక్కడ ప్లాంట్ నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి.
సీఎం రేవంత్రెడ్డితో భేటీ మర్నాడే ఫ్యాక్స్కాన్ యూటర్న్
ఆశ్చర్యకరంగా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖామంత్రి శ్రీధర్బాబుతో కలిసి, ఢిల్లీలో ఫాక్స్కాన్ ఛైర్మన్తో సమావేశమైన మర్నాడే బెంగుళూర్ ప్లాంటుపై నిర్ణయం వెలువడటం గమనార్హం. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా తమ రాష్ట్రంలో ప్లాంట్ నెలకొల్పాలనే నిర్ణయం తీసుకుంటే అన్నివిధాల సహాయసహకారాలందిస్తామని వారికి హామీ ఇచ్చారు. సమాధానంగా యూంగ్ లియూ కూడా తెలంగాణను సందర్శిస్తానని ముఖ్యమంత్రికి మాటిచ్చారు. అదేరోజు బెంగళూరు వెళ్లిపోయిన ఫాక్స్కాన్ బృందం సాయంత్రం సీఎం సిద్ధరామయ్యతో సమావేశం కావడం, అది పూర్తయిన వెంటనే సిద్దరామయ్య ఫాక్స్కాన్ రెండో ప్లాంట్ గురించిన సమాచారాన్ని విడుదల చేయడం చకచకా జరిగిపోయింది.
మార్చి 2, 2023న, అప్పటి తెలంగాణ ప్రభుత్వంతో ఫాక్స్కాన్ ఒక ఒప్పందాన్ని ఖరారు చేసుకుని, మూడు వారాల్లోపే, మార్చి 15న కొంగరకలాన్లో ప్లాంట్కు భూమిపూజ చేసింది. అక్కడ యాపిల్ ఎయిర్పాడ్స్ తయారుచేస్తారని తెలిపింది. ఇందుకోసం 500 మిలియన్ డాలర్లు వెచ్చించిన ఫాక్స్కాన్, దీని ద్వారా 25వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని, ఇది ఇంకా పెరుగుతాయని చెప్పింది. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.
ప్రతిపక్షాలకు విమర్శనాస్త్రం
ఫాక్స్కాన్ తరలిపోతుందన్న బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సందేహాలు వ్యక్తం చేస్తున్న క్రమంలోనే ఆ సంస్థ బెంగుళూర్కు తరలిపోవడం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సహజంగానే ఇరకాటంగా మారింది. నిన్న అమర్ రాజా నేడు ప్యాక్స్కాన్ అంటూ బీఆరెస్ వర్గాలు విమర్శల దాడికి పదును పెడుతున్నాయి. సీఎం రేవంత్డ్డి పాలనలో కొత్త విదేశీ పెట్టుబడుల మాటేమోగాని గతంలో ముందుకొచ్చిన సంస్థలు కూడా తరలిపోతున్నాయని బీఆరెస్ విమర్శలు గుప్పిస్తుంది. ఒక కాంగ్రెస్ పాలిత రాష్ట్రం నుంచి మరో కాంగ్రెస్ పాలిత రాష్ట్రానికి ఫ్యాక్స్కాన్ వంటి పారిశ్రామిక సంస్థలు తరలిపోవడం వెనుక మర్మమేమటని, అమర్ రాజా ఏపీకి తరలిపోయో ఫ్రమాదముందని, ఇలా తమ పార్టీ మిత్రులను, పాత మిత్రులను సంతృప్తి పరిచేందుకు పరిశ్రమలు తరలిపోతుంటే ప్రభుత్వమే ప్రేక్షక పాత్ర పోషిస్తుందని, అదే రాష్ట్రానికి చెందిన బీఆరెస్ అధికారంలో ఉండి ఉంటే ఇలా జరిగేది కాదంటూ బీఆరెస్ సోషల్ మీడియా వర్గాలు విమర్శలు సాగిస్తున్నాయి.