* స్వామితో టచ్లో ఉన్నామన్న అమిత్ షా వ్యక్తిగత కార్యదర్శి
* ఎమ్మెల్యేల ట్రాప్ స్టోరీని జాతీయ మీడియాకు ఎందుకివ్వలేదు?
* నిన్న హంగామా చేసిన టీఆర్ఎస్ నేడు భయపడిందా?
* కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలతో పోలీసులు మౌనం?
* అనుమానాలకు తావిస్తున్న దర్యాప్తు
జాతీయ పార్టీగా ఎదగాలని అనుకుంటున్న బీఆర్ఎస్ గోల్డన్ ఛాన్స్ మిస్ చేసుకుందా? అమిత్ షా వ్యక్తిగత కార్యదర్శితో మధ్యవర్తి స్వామిజీ టచ్లో ఉన్నారని చెప్పినప్పటికీ.. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి ఎలాంటి పోరాటం చేయకుండానే తెరాస వెనకడుగు వేసిందా? ఈ వ్యవహారంపై నిన్నటి నుంచి హంగామా చేసిన టీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఒక్కసారిగా మౌనం వహిస్తోంది? టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల అంశాన్ని జాతీయ స్థాయి మీడియాలో హల్చల్ చేయకపోవడానికి కారణమేంటి? కేటీఆర్ ఎందుకు షూ గప్చుప్ అంటూ సంకేతాలు పంపించారు? కఏకేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి సంకేతాలు అందడంతో పోలీసులూ ఈ అంశంలో మౌనం వహిస్తున్నారా? మొత్తానికి రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించి, రాజకీయ ప్రకంపనలు రేపుతున్న ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అధికార టిఆర్ఎస్ పార్టీకి సెల్ఫ్ గోల్ గా మారనున్నదా? మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్యా యత్నం కేసు మాదిరిగా బూమరాంగ్ కానున్నదా? లేక రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న బీజేపీ రాజకీయ భవిష్యత్తుకు గొడ్డలిపెట్టుగా మారనున్నదా?
మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల బెర సారాల కేసు ఎన్నో అనుమానాలను, అపోహలను మిగిలుస్తున్నది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు నుంచి మొదలుకొని టీఆర్ఎస్ ఆరోపణలు, బీజేపీ ప్రత్యారోపణలలో వాస్తమెంత? ఎవరిది నిజం.. ఎవరిది అబద్ధం.. ఇలా ఒక్క ఘటన ఎన్నో ప్రశ్నలను రేకెత్తిస్తున్నది. వాస్తవానికి పోలీసులు ఫామ్ హౌజుకు చేరక ముందే రూట్ మ్యాపుతో పాటు మీడియాకు బేరసారాల అంశం ముందే లీక్ కావడం ఆలోచింప చేస్తోంది. మొదట మీడియాతో మాట్లాడిన సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర.. నేలచూపులు చూస్తూ ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారం మేరకే తాము అజిత్ నగర్ ఫామ్ హౌస్ కు చేరుకున్నామని చెప్పారు. సాధారణంగా పోలీసులు తాము విశ్వసనీయ వర్గాల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్నామని చెబుతారు. ఇక్కడ స్టీఫెన్ మాత్రం అధికార పార్టీ ఎమ్మెల్యేలు సమాచారం ఇస్తేనే వచ్చామని స్పష్టం చేశారు. అంటే ఫామ్ హౌస్ కి వెళ్లేముందే తమను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారనే సమాచారం ఎమ్మెల్యేలు ఇచ్చారా.. లేక ప్రలోభ పెట్టే సమయంలో ఫోన్ చేశారా అనే అంశంపై స్పష్టత లేదు.
* పోలీసులకు ముందే మీడియా స్పాట్కు చేరుకోవడం అనుమానాలకు తావిస్తున్నది. మొదట 100 కోట్ల డీల్ జరుగుతున్నది.. తొందరగా రావాలని స్థానిక రాజేంద్రనగర్ పోలీసులు రిపోర్టర్లకు సమాచారం ఇచ్చారు. అందుకు సంబంధించిన రూట్ మ్యాప్ కూడా విడుదల చేశారు. తాము వెళ్తున్నాం.. మీడియా కూడా తొందరగా చేరుకోవాలని ఫోన్ల ద్వారా సమాచారం ఇచ్చారు. కానీ, పోలీసుల కంటే ముందే.. ఒక అధికారిక ఛానల్ తో పాటు మరో రెండు ఛానల్ బృందాలు ఫామ్ హౌస్ చేరుకొని ఆరా తీయడం మొదలు పెట్టాయి. మరి వాళ్లకు ముందుగా సమాచారం ఇచ్చిందెవరు? ఫామ్ హౌజ్లో ఎమ్మెల్యేల ఆపరేషన్ పై ఒక టీవీ ఛానల్ ఘటన జరగడానికి కంటే రెండు గంటల ముందు, అంటే సాయంత్రం ఐదు గంటలకి కెమెరాలతో సిద్ధమైనట్లు సమాచారం.
* ఇక మొదట ఏదో 100 కోట్ల డీల్ అని చెప్పిన పోలీసులు ఆ తర్వాత అంత సీన్ లేదు 15 కోట్ల అని ప్రకటించారు. ఆ నగదును కూడా వారు చూపెట్టలేకపోయారు. ఫామ్ హౌస్ లో ఏం చేస్తున్నారని నలుగురు ఎమ్మెల్యేలను ప్రశ్నించాల్సిన పోలీసులు వారిని చూసి చూడనట్లు వదిలేశారు. వాళ్లకు నేరుగా ప్రగతి భవన్ నుంచి పిలుపు వచ్చింది. ఇది అందరూ చూస్తుండగానే జరిగిన బహిరంగ సత్యం. ఇక పైలట్ రోహిత్ రెడ్డిని నామమాత్రంగా ప్రశ్నించి మొత్తం 400 కోట్ల డీల్ అని తాము మాత్రం బీజేపీ ప్రలోభానికి లొంగలేదని స్వామీజీల పేర్లు చెప్పి తప్పించుకున్నారు. ఫామ్ హౌస్ లో ఉన్న స్వామీజీలు ఏమి చెప్పారనేది ఇంతవరకు మిస్టరీగానే ఉంది.
* ఇక ఈ డీల్ కు మొత్తం మధ్యవర్తిగా ఉన్న నందకిషోర్ అనే వ్యాపారి.. స్వామీజీలు పూజ కోసం వచ్చినట్టు సంకేతాలిచ్చారు. మొదట తమ స్నేహితుని కలవడానికి వచ్చానని చెప్పిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ ఆ తర్వాత మాట మార్చారు. ఫామ్ హౌస్ లో ప్రలోభాలకు లొంగకుండా నిఖార్సయిన నిఖార్సైన వ్యక్తులుగా నిలిచిన ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడకుండా హడావుడిగా ప్రగతి భవన్ కు వెళ్లడం మీడియాను కూడా ఆలోచనలో పడవేసింది. పట్టుబడ్డ 15 కోట్లను కూడా పోలీసులు ఇంతవరకు బహిర్గతం చేయకపోవడం విశేషం. ఈ సంఘటన జరిగి 18 గంటలు గడిచినా అటు టిఆర్ఎస్ కానీ ఇటు పోలీసులు కానీ ఎందుకు ఆడియోలు లీక్ చేయలేదు. ఫోన్ టాపింగ్ ఏమైనా చేస్తే అది బయటపడుతుందన్న భయంతో నా? సరైన ఆధారాలు లేకనా అన్న విషయం తేలాల్సి ఉంది.
* సాధారణంగా గురువారం ఉదయం ఆడియోలు, వీడియోలతో టిఆర్ఎస్ హల్చల్ చేస్తుందని.. పోలీసులు, ఎమ్మెల్యేలు నిర్దిష్ట ఆధారాలతో మీడియా ముందుకు వస్తారని ప్రజలెంతో ఆసక్తిగా ఎదురు చూశారు. బీజేపీ బండారం ఏ విధంగా బయట పెడతారని మీడియా ఉత్కంఠతో వేచి చూసింది. కానీ పోలీసులు రాలేదు.. ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టలేదు.. సీఎం కూడా సాయంత్రం వరకు స్పందించ లేదు. పైగా ఆరోపణలకు గురైన భారతీయ జనతా పార్టీ తరఫున అగ్ర నాయకులు ఎదురు దాడి మొదలుపెట్టారు. దమ్ముంటే నిరూపించాలని సవాల్ చేశారు. నిజానిజాలను బయటపెట్టాలని కోర్టును కూడా ఆశ్రయించారు. ఈ పరిణామంతో మొదటి దాడి చేసిన టీఆర్ఎస్ కు ఇరకాటంగా మారింది. బీజేపీ ఎదురు దాడిని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే విషయంపై తర్జన భర్జన పడుతోంది. ఓటుకు నోటు కేసులో అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పట్టుబడ్డప్పుడు ఆడియో వీడియోలతో సహా అన్ని ఆధారాలను బయట పెట్టిన పోలీసులు, టిఆర్ఎస్ నాయకులు.. ఈసారి మాత్రం ఆ పనిని చేయలేకపోయారు. అందుకు సరైన ఆధారాలు లభించకపోవడమే కారణమా? వారిలో ఏమైనా భయాలు దాగి ఉన్నాయా? అసలు బీజేపీ బేరసారాల కోసం రూ.400 కోట్లను వెచ్చిస్తుందా అనేది ప్రశ్నగానే మిగిలింది.
* ఒకటి మాత్రం నిజం మునుగోడు ఎన్నికల క్రమంలో టీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఎత్తుకు పై ఎత్తు వేసుకుంటూ.. దిగజారుడు పనులకు పాల్పడుతున్నారు. స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్ వంటి నాయకులను టీఆర్ఎస్ లాగడంతో ప్రతికారంగా బీజేపీ కూడా కొంతమంది టిఆర్ఎస్ నాయకులకు ఎరవేసిందనే ప్రచారం జరిగింది. కొందరు ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ వంటివారు స్టేట్మెంట్ ఇవ్వడం దీనికి బలాన్ని చేకూర్చింది. కానీ బీజేపీ ఇంకా వల విసరక ముందే టీఆర్ఎస్ తొందరపడిందా? సరైన ఆధారాలను సేకరించకపోవడం వల్ల ఎపిసోడ్ బూమరాంగ్ అయ్యిందా అనే ప్రచారం జరుగుతోంది. నలుగురు ఎమ్మెల్యే కోసం రూ. 400 కోట్లను వెచ్చించాల్సిన అవసరం బీజేపీకి ఉందా అనేది ఆలోచించాల్సిన విషయం. ఈ వ్యవహారంలో అందరితో సత్సంబంధాలు ఉన్న ఒక చిరు వ్యాపారిని నలుగురు ఎమ్మెల్యేలను లాగడం వల్ల బీజేపీకి తక్షణమే చేకూరే ప్రయోజనమేమిటి? కేవలం మునుగోడు ఉప ఎన్నిక కోసం ఇంత పెద్ద సాహసం చేస్తుందా? టీఆర్ఎస్, బీజేపీల మధ్య రాష్ట్రంలో సీరియస్ ఫైట్ జరుగుతుంది. గతంలో స్నేహపూర్వకంగా ఉన్న రెండు పార్టీలు.. అమీ తుమీ తేల్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తున్నాయి. మరి, ప్రలోభాల ఎత్తులో.. బ్లేమ్ గేమ్ లో చివరకు ఎవరు చిత్తవుతారో?