- తెలంగాణకు క్యూ కట్టిన వాహనాలు
- జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం
- నేడు కూడా వాహనాల రద్దీ కొనసాగే అవకాశం
ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎపికి వెళ్లిన ఓటర్లు తెలంగాణకు తరలి వస్తుండటంతో పలు టోల్ఫ్లాజాల వద్ద వాహనాల రద్దీ అధికంగా ఏర్పడిందని ఎన్హెచ్ఏఐ అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం ఓటింగ్లో పాల్గొన్న ఎపికి చెందిన ఓటర్లతో పాటు ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల వాసులు తిరిగి సాయంత్రం హైదరాబాద్కు బయలుదేరి రావడంతో టోల్ఫ్లాజా రద్దీ అధికంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ఫ్లాజాతో పాటు కేతేపల్లి మండలం కోర్లపహాడ్ టోల్ప్లాజాల వద్ద వాహనాల రద్దీ అధికంగా ఉందని అధికారులు తెలిపారు.
పలుచోట్ల ఫాస్ట్ ట్యాగ్ స్కానింగ్ ఆలస్యం అవుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. దీంతో వాహనాలు కిలో మీటర్ల మేర బారులు తీరడంతో ట్రాఫిక్ను క్లియర్ చేయడానికి పోలీసులు రంగంలోకి దిగడం విశేషం. మూడు రోజులు శని, ఆది, సోమవారాలు సెలవులు రావడంతో ఉద్యోగ, ఉపాధి రీత్యా హైదరాబాద్లో స్థిరపడిన వారంతా ఓటేసేందుకు ఎపితో పాటు ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు తరలివెళ్లారు. ముఖ్యంగా సొంత వాహనాల్లో చాలామంది ఓటర్లు తరలివెళ్లారు. ఈ నేపథ్యంలోనే తిరుగు ప్రయాణంలో వారంతా ఎపి టు హైదరాబాద్ వస్తుండడంతో హైవేపై పలుచోట్ల ట్రాఫిక్ జాం అవుతోందని ప్రయాణికులు పేర్కొన్నారు. అయితే ఈ వాహనాల రద్దీ నేడు కూడా కొనసాగే అవకాశం ఉందని టోల్ఫ్లాజా నిర్వాహకులు తెలిపారు.