రెండో వన్డే కూడా మనదే

INDIA WON 2ND ODI AGAINST KIWIS

  • కివీస్ పై 90 పరుగులతో భారీ విజయం

విదేశీగడ్డపై టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా శనివారం మౌంట్ మాగానీలో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ లో ఇరగదీసిన భారత బ్యాట్స్ మెన్ 324 పరుగుల భారీ స్కోర్ చేయగా.. తర్వాత బ్యాటింగ్ కు దిగిన కివీస్ ను ఏ దశలోనూ కుదురుకోనీయకుండా చేయడంలో మన బౌలర్లు విజయం సాధించారు. దీంతో ఆతిథ్య జట్టుపై 90 పరుగుల తేడాతో భారత్ గెలుపొంది, ఐదు వన్డేల సిరీస్ లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. భారత్‌ నిర్దేశించిన 325 పరుగుల లక్ష్య ఛేదనలో కివీస్‌ తడబడింది. మార్టిన్‌ గప్టిల్‌(15), విలియమ్సన్‌(20), మున్రో(31), రాస్‌ టేలర్‌(22), టామ్‌ లాధమ్‌(34), గ్రాండ్‌ హోమ్‌(3), హెన‍్రీ నికోలస్‌(28), ఇష్‌ సోధీ(0)లు వరుసగా క‍్యూకట్టడంతో కివీస్‌కు ఘోర ఓటమి తప్పలేదు. బ్రాస్‌వెల్‌(57; 46 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించినప్పటికీ కివీస్‌ను గెలిపించలేకపోయాడు.

భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ నాలుగు వికెట్లు తీయగా.. భువనేశ్వర్‌ కుమార్‌, చహల్‌లు తలో రెండు వికెట్లు పడగొట్టారు. షమీ, కేదర్‌ జాదవ్‌లకు చెరో వికెట్‌ దక్కింది. అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 325 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రోహిత్ శర్మ‌(87; 96 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు), శిఖర్‌ ధావన్‌(66; 67 బంతుల్లో 9 ఫోర్లు)ల  హాఫ్‌ సెంచరీలకు తోడు విరాట్‌ కోహ్లి(43; 45 బంతుల్లో 5 ఫోర్లు) , అంబటి రాయుడు(47; 49 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌), ఎంఎస్‌ ధోని(48 నాటౌట్‌;33 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌)లు రాణించారు. చివర్లో కేదర్‌ జాదవ్‌(22 నాటౌట్‌; 10 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌) బ్యాట్‌ ఝుళిపించడంతో భారత్‌ జట్టు నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 324 పరుగుల భారీ స్కోరు చేసింది. కివీస్‌ బౌలర్లలో ట్రెంట్‌ బౌల్ట్‌, ఫెర్గ్కుసన్‌లు తలో రెండు వికెట్లు తీశారు.

SPORTS UPDATES

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article