రాయలసీమ లిఫ్ట్ పథకాన్ని తాము మొదట్నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నామని.. రోజూ మూడు టీఎంసీ ల నీళ్ల ను తరలించే ఈ ప్రాజెక్టు తో ఐదు జిల్లాలు నష్టపోతాయని తమ ఫిర్యాదుల్లో పేర్కొన్నామని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. గ్రీన్ ట్రిబ్యునల్ వెళ్లి స్టే కూడా తెచ్చాం.. ఏపీ ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడితే దాన్ని కూడా ట్రిబ్యునల్ కు నివేదించాం.. కేంద్ర ప్రభుత్వానికి రాయలసీమ ప్రాజెక్టుపై దఫాదఫాలు గా సీఎం ఘాటైన లేఖ కూడా రాశారు.. తెలంగాణ ను ఎండబెట్టడం మొదట్నుంచి ఆంధ్రా పాలకులకు అలవాటే.. తెలంగాణ కు ఎత్తి పోతల పథకాలే శరణ్యమని తెలిసినా సమైక్య పాలకులు ఉద్దేశ్య పూర్వకంగా వాటిని నిర్లక్ష్యం చేశారు.. ఉమ్మడి ఏపీ లో తెలంగాణ ప్రాజెక్టులు శిలాఫలకాలకే పరిమితమయ్యాయి.. తెలంగాణ దోపిడీకి చంద్రబాబు ఒక్క అడుగు ముందుకేస్తే వై ఎస్ వంద అడుగులు వేశారని జగదీష్ రెడ్డి తెలిపారు.
కొందరు కేసీఆర్ చిత్తశుద్ధి పై పిల్ల కాకుల్లాగా మాట్లాడుతున్నారు.. వై ఎస్ జలదోపిడీకి వంత పాడిన వారే ఈ రోజు కేసీఆర్ ను విమర్శిస్తున్నారు.. తెలంగాణ రాకుండా చేయడానికి వై ఎస్ చేయని ప్రయత్నమంటూ లేదు.. ఆనాడు కాంగ్రెస్ లో ఉన్న తెలంగాణ నేతలు ఎవ్వరూ వైఎస్ జల దోపిడీ ని ,తెలంగాణ వ్యతిరేకతను అడ్డు కోలేక పోయారు.. తెలంగాణ కోసం కేసీఆర్ శాఖ లేని మంత్రిగా కూడా కొనసాగారు.. కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నపుడు ఏపీ అక్రమ ప్రాజెక్టులను వైఎస్ ఎదుటే గట్టిగా వ్యతిరేకించారు.. కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాల నుంచి టీ ఆర్ ఎస్ బయటకు రావడానికి తెలంగాణ కు జరుగుతున్న సాగు నీటి అన్యాయమే ప్రధాన కారణమన్నారు.
అపుడు వై ఎస్ కు మద్దతుగా తెలంగాణ ఉద్యమాన్ని నిర్వీర్యపరిచిన వారే ఇపుడు కేసీఆర్ మీద ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ సమాజానికి అండగా ఉండాల్సిన ప్రతిపక్షాలు ఏపీ ప్రభుత్వ వైఖరికి వంతపాడుతున్నాయని విమర్శించారు. ఆనాడు ఏపీ కి అక్రమంగా నీళ్ల తరలింపునకు హారతులు పట్టిన వారు ఈ రోజు విమర్శిస్తారా? వైఎస్ నీళ్ల దొంగ జగన్ అంతకు మించిన గజదొంగ అనడానికి ప్రతి పక్షాలకు నోళ్లు ఎందుకు రావడం లేదని దుయ్యబట్టారు. వైఎస్ ఇపుడు లేకున్నా కాంగ్రెస్ నేతలు ఏపీ తీరు పై ఎందుకు మాట్లాడం లేదు? ఇంకా బానిస బతుకులు మానుకోరా కాంగ్రెస్ నేతలు అని ఎద్దేవా పలికారు. రెండు జాతీయ పార్టీలు తెలంగాణ కు ద్రోహం చేస్తున్నాయని విమర్శించారు.
- కాంగ్రెస్, బీజేపీలు ద్రోహం చేసినా టీ ఆర్ఎస్ తెలంగాణ నీటి వాటా కోసం పోరాడుతుందని.. ఒక్క చుక్క ను కూడా అన్యాయంగా ఏపీ కి తరలించడాన్ని ఒప్పుకోమన్నారు. టీఆర్ఎస్ పుట్టకుంటే తెలంగాణ పరిస్థితి ఏమయ్యేదని ప్రశ్నించారు. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టుల వల్ల ఉపయోగం లేదని కాంగ్రెస్ నేతలు బుద్ది లేకుండా మాట్లాడుతున్నారని.. కోటి ఎకరాలు ఎలా సాగులోకి వచ్చాయో ప్రజలకు తెలుసన్నారు. ధాన్యం రికార్డు ఉత్పత్తి మాటలతో సాధ్యమా? పాలమూరు కు వలసలు వాపస్ సంగతి గమనించడం లేదా ? ప్రతిపక్షాలకు ఇంకా జ్ఞానోదయం కావడం లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హాయం లో సాగర్ కింద పదేళ్లలో మూడు పంటలు కూడా పండలేదని గుర్తు చేశారు. టీఆర్ఎస్ పాలనలో సాగర్ కింద ఎనిమిది పంటలు పండాయన్నారు.
- వైఎస్ కట్టె తో తెలంగాణ ప్రజలను కొట్టిన కాంగ్రెస్ నేతల బుద్ది ఇంకా పోవడం లేదు.. బీజేపీ వాళ్లకు తెలంగాణ సోయి లేదు.. ఎవరు కలిసి వచ్చినా రాకున్నా మేము వెయ్యింతల బలం తో ఏపీ జల దోపిడీ ని అడ్డుకుంటామన్నారు. మా నైతిక స్థైర్యాన్ని ఎవ్వరూ దెబ్బ తీయలేరని తెలిపారు. షర్మిల తెస్తానంటున్న రాజన్న రాజ్యం అంటే తన తండ్రికి మించిన దోపిడీ ని కొనసాగిస్తామనడమేనని విమర్శించారు. జగన్ కు మంచి పాలన అందించే ఉద్దేశ్యం, ఏపీ ప్రజలకు నీళ్లిచ్చే యోచన లేనట్టుందన్నారు. కేసీఆర్ చేసిన సూచనలు పాటించి ఉంటే ఏ వివాదాలు లేకుండా కృష్ణా జలాలు రెండు రాష్ట్రాలు వాడుకునే వీలుండేదన్నారు. వైఎస్ తరహాలోనే జగన్ కు తెలంగాణ వ్యతిరేక ధోరణి ఉందన్నారు.
రాయలసీమ లిఫ్టు పనులు ఆపి, జీవో ఉపసంహరించుకుంటే జగన్తో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. జల వివాదం అంశాన్ని ట్రిబ్యునల్ కే కాదు ప్రజల్లోకి తీసుకెళతామన్నారు. కేంద్రం మీద కూడా ఒత్తిడి పెంచుతామని.. కేంద్రం ఈ వివాదం లో ప్రేక్షక పాత్ర వహించకూడదన్నారు. మళ్ళీ ట్రిబ్యునల్ కు వాస్తవాలు తెలియజేస్తామని.. తాము మౌనంగా ఉన్నామని కొందరు బుద్ది హీనంగా మాట్లాడుతున్నారని.. తెలంగాణ కు అన్యాయం జరిగితే పోరాడే వాళ్లలో కేసీఆర్ కు మించిన వారు ఎవరున్నారని ప్రశ్నించారు.