JALLIKATTU IN GUNNIS RECORDS
తమిళనాడులో సాహసవంతమైన ఆటగా పేరు పొందిన జల్లికట్టు మరో ఘనత సాధించింది. అత్యంత సాహసోపవంతమైన ఈ సంప్రదాయ క్రీడ తాజాగా గిన్నిస్ పుస్తకంలోకి ఎక్కింది. ఆదివారం పుదుకోట్టై జిల్లా విరాళిమలైలో జరిగిన జల్లికట్టుకు గిన్నిస్ సంస్థ ప్రతినిధులు వచ్చి, ఆ క్రీడ నిర్వాహకులకు సర్టిఫికెట్ అందజేశారు. అయితే, ఈ ఆట చూడటానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం విషాదం. ఆటలో భాగంగా ఎద్దులను అదుపులోకి తెచ్చేందుకు యత్నించి 31 మంది గాయాలపాలయ్యారు. గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించాలన్న ప్రయత్నంలో భాగంగా ప్రత్యేకంగా జల్లికట్టు నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయించారు. గిన్నిస్ సంస్థ ప్రతినిధుల సమక్షంలో 1,354 ఎద్దులను రంగంలోకి దించగా.. వాటిని పట్టుకునేందుకు మాత్రం 424 క్రీడాకారులనే అనుమతించారు. తొలుత 2,000కు పైగా ఎద్దులను బరిలోకి దించాలని భావించినప్పటికీ సమయాభావం కారణంగా కుదరలేదు. పోటీలో ఎద్దుల సంఖ్య ఎక్కువ, పాల్గొనేవారి సంఖ్య తక్కువ కావడంతో క్రీడాకారులతో పాటు సందర్శకులకు కూడా వైద్య బీమా కల్పించారు. ఎద్దులతో జరిగిన పోరులో దాదాపు 31 మంది గాయపడ్డారు. ఈ సంప్రదాయ క్రీడను తిలకించేందుకు వచ్చిన వారిపైకి ఎద్దులు దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడి రాము(25), సతీష్(43) అనే ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు.
పూర్వం నుంచి సంప్రదాయంగా వస్తున్న ఈ క్రీడ వల్ల ప్రాణాలు పోతున్నాయని, ఇది రాక్షస క్రీడ అని, వెంటనే దీన్ని నిషేధించాలని గతంలో కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని విచారించిన న్యాయస్థానం జల్లికట్టుపై నిషేధం విధించింది. అయితే, తమిళనాడులోని ప్రజలు, నేతలు పార్టీలకతీతంగా జల్లికట్టుగా మద్దతుగా నిలవడంతో ఈ ఆటను కొనసాగించేందుకు ప్రభుత్వం 2017లో ఏకంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. అప్పట్లో సినీతారలు సైతం జల్లికట్టుకు మద్దతుగా నిలవడంతో సర్కారు ఆర్డినెన్స్ తీసుకురావాల్సి వచ్చింది.