KARNATAKA CM TOOL BLESSINGS FROM CHINA JEEYAR SWAMY
ఇప్పుడు సీఎంలు స్వామీజీల బాట పట్టారు. సీఎం కేసీఆర్ ను అనుసరిస్తున్నారు. కేసీఆర్ తో పాటు జగన్ కూడా స్వామీజీలకు ప్రత్యేక స్థానం ఇస్తుంటే తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కూడా అదే కోవలో చేరిపోయారు. ఆయన హైదరాబాద్లో చినజీయర్ స్వామిని కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. గురువారం రాత్రి బెంగళూరు నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న యడ్డీ.. నేరుగా ముచ్చింతల్లోని చినజీయర్ ఆశ్రమానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేశారు.అనంతరం శుక్రవారం తెల్లవారుజామున శ్రీ యాగంలో కుటుంబసభ్యులతో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
యెడ్డీ రాకపై చినజీయర్ శిష్యుడు, మైహోమ్స్ గ్రూప్ అధినేత రామేశ్వరరావు మాట్లాడుతూ.. యడియూరప్ప సీఎం అయిన సందర్భంగా చినజీయర్ ఆశీర్వాదాలు తీసుకున్నారని.. ఆశ్రమం ప్రాంగణంలో శ్రీరామచంద్రుడిని దర్శించుకున్నారని తెలిపారు.కేబినెట్ విస్తరణ తర్వాత మరోసారి దర్శనానికి వస్తానని చెప్పినట్లుగా రామేశ్వరరావు వెల్లడించారు. శ్రావణమాసం ఆరంభమవుతున్న సందర్భంగా మంగళ శాసనాలు చేస్తున్నామని.. ఈ మాసంలో ఐదు శుక్రవారాలు వచ్చాయని.. శ్రావణ మాసం వస్తూ వస్తూనే వానలు తీసుకొచ్చిందని ఆయన తెలిపారు.