న్యూఢిల్లీ:జాతీయ రాజకీయాలు, జాతీయ పార్టీ అంటూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పగటి కలలు కంటున్నారని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించే స్థాయి సీఎం కేసీఆర్కు లేదన్నారు. టీఆర్ఎస్ పార్టీలో కట్టప్పలు సిద్ధంగా ఉన్నారని లక్ష్మణ్ అన్నారు. ఆ పార్టీకి వెన్నుపోటు తప్పదనే అర్థంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ కట్టప్పల విషయంలో బీజేపీది ప్రేక్షక పాత్ర మాత్రమేనని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ‘బీజేపీలో కొండా విశ్వేశ్వర్రెడ్డి చేరిక ట్రైలర్ మాత్రమేనని.. సినిమా ముందుంది’ అని లక్ష్మణ్ అన్నారు.టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత రోజురోజుకూ పెరుగుతోందని లక్ష్మణ్ విమర్శించారు. టీఆర్ఎస్, ఎంఐఎంకు ప్రజలే బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన లక్ష్మణ్ను తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ముఖ్య నేతలు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లక్ష్మణ్ మాట్లాడారు.తనను రాజ్యసభకు ఎంపిక చేసినందుకు ప్రధాని మోదీకి, పార్టీ అధిష్టానానికి లక్ష్మణ్ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి బండి సంజయ్, కిషన్ రెడ్డి కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రధాని మోదీ దక్షిణాదికి, ముఖ్యంగా తెలంగాణకు ఎలాంటి ప్రాధాన్యం ఇస్తున్నారో లక్ష్మణ్ చెప్పుకొచ్చారు. నిన్న రాజ్యసభకు నామినేట్ చేసిన నలుగురు ప్రముఖులూ దక్షిణాదిలో నాలుగు రాష్ట్రాలకు చెందిన వారేనని ఆయన గుర్తు చేశారు.