KCR WARNING TO SARPANCHES
కరెంటు బిల్లుల చెల్లింపుల విషయంలో సర్పంచులు, మున్సిపల్ చైర్ పర్సన్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇకపై ఎప్పటికప్పుడు విద్యుత్ బిల్లులు చెల్లించకపోతే కఠిన చర్యలు తీసుకుంటానని స్పష్టంచేశారు. బుధవారం విద్యుత్ శాఖ అధికారులతో సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలు, మున్సి పాలిటీలు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించకపోవడంపై మండిపడ్డారు. ఇప్పటికే అవి చాలా పెద్ద ఎత్తున బకాయిలు పడ్డాయని, వాటిని వన్ టైం సెటిల్మెంట్ కింద ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. ఇప్పటి నుంచి నెలనెలా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, హెచ్ఎండబ్ల్యూఎస్ వంటి సంస్థలు విద్యుత్ బిల్లులు చెల్లించాలని స్పష్టంచేశారు. సకాలంలో కరెంటు బిల్లు కట్టకపోతే గ్రామాల్లో అయితే సర్పంచ్, గ్రామకార్యదర్శి, మున్సిపాలిటీ అయితే చైర్పర్సన్, కమిషనర్లపై వేటు తప్పదని హెచ్చరించారు. అలాగే గ్రామాలు, పట్టణాల్లో వీధి లైట్ల వాడకంలో కూడా క్రమశిక్షణ రావాలని, పగలు లైట్లు వెలగకుండా చూసుకోవాలని కేసీఆర్ సూచించారు. తెలంగాణ ఏర్పడినప్పుడు తీవ్ర విద్యుత్ సంక్షోభం ఉండేదని, ప్రస్తుతం తెలంగాణలో అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ లో కనురెప్ప పాటు కూడా కరెంటు పోకుండా ఉండేందుకు ప్రభుత్వపరంగా చేయాల్సిందంతా చేస్తా మన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు, ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ సరఫరా చేయడానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.