భార్యను ప‌ద‌కొండేళ్లు గదిలో నిర్బంధం

* న్యాయ‌వాది నిర్వాకం..

* విజయనగరం సత్యసాయి జిల్లాకు చెందిన యువతి నరక‌యాతన

పవిత్రమైన న్యాయవాద వృత్తిలో ఉన్న ఓ న్యాయవాది ఆ వృత్తికే కళంకం తెచ్చాడు. తన తల్లి, సోదరుడు మాటలు విని తాళి కట్టిన భార్యను ఏకంగా 11 సంవత్సరాల పాటు ఇంట్లో బంధించి బయట ప్రపంచానికి దూరం చేశాడు. చీకటి గదిలో బక్క చిక్కిన శరీరంతో 11 ఏళ్ల పాటు కఠినాతి కఠినమైన జీవితాన్ని ఆమె అనుభవించింది. తన న్యాయవాద వృత్తిని అడ్డం పెట్టుకొని బయట ప్రపంచానికి, తల్లిదండ్రులకు దూరం చేసిన ప్రబుద్ధుడు గోదావరి మధుసూదన్‌.

వన్‌టౌన్‌ సి ఐ బి. వెంకట్రావు తెలిపిన వివరాలు ప్రకారం.. శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాకు చెందిన సాయి సుప్రియ ను విజయనగరంలోని కంటోన్మెంట్‌ బాలాజీ మార్కెట్‌ సమీపంలో ఉంటున్న గోదావరి మధుసూదన్‌ 2008లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం కలిగిన అనంతరం న్యాయవాది మధుసూదన్‌ తన తల్లి గోదావరి ఉమామహేశ్వరి తో పాటు తన తమ్ముడు మాటలు విని కట్టుకున్న భార్యను వేధించాడు. బయట ప్రపంచానికి దూరం చేస్తూ చీకటి గదిలో 11 సంవత్సరాలు పాటు బంధించాడు. బాధితురాలు కుటుంబ సభ్యులు ఎన్ని మార్లు అడిగినప్పటికీ న్యాయవాది తన వృత్తిని అడ్డం పెట్టుకొని బాధితురాలు కుటుంబ సభ్యులను బెదిరించేవాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో తమ కుమార్తె ఏమైందో తెలియక వారు నరకయాతన అనుభవించారు. సహనం కోల్పోయిన బాధితురాలి తల్లిదండ్రులు ఇటీవల జిల్లా ఎస్‌పికి ఫిర్యాదు చేయడంతో ఒకటవ పట్టణ పోలీసులు గతనెల 28 మధుసూదన్‌ ఇంటికి వెళ్లి పరిశీలించారు. తమ ఇంటిని తనిఖీ చేసే అధికారం మీకు లేదని, తనిఖీ చేసేందుకు కోర్టు ఆదేశాలు ఏమైనా ఉన్నాయా అంటూ మధుసూదన్‌ పోలీసులను ప్రశ్నించడంతో పోలీసులు, బాధితురాలి తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి సెర్చ్‌ వారెంట్‌ తీసుకువచ్చారు. దీంతో బుధవారం పోలీసులు న్యాయవాది మధుసూదన్‌ ఇంటిని తనిఖీ చేయగా సాయి ప్రియ బక్క చిక్కిన శరీరంతో చీకటి గదిలో దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తూ ఓ మూలన కనిపించింది. దీంతో పోలీసులు ఆమెను బయటకు తీసుకువచ్చి న్యాయస్థానంలో హాజరు పరిచారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు నిందితులపై చర్యలు తీసుకుంటామని సిఐ తెలిపారు
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article