LOVERS COMMIT SUICIDE
- ఒకే చెట్టు కొమ్మకు ఉరి వేసుకున్న ప్రేమజంట
- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో ఘటన
వారిద్దరి వయసూ 19 ఏళ్లే. ఇద్దరూ వేర్వేరు మతాలకు చెందినవారు. ఈ కారణంతో తమ పెళ్లికి పెద్దరు అంగీకరించరనే ఆందోళనతో బలవంతంగా తనువు చాలించారు. ఇద్దరూ కలిసి ఒకే చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర సంఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది.
రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామానికి చెందిన బాలేష్(19) అనే యువకుడు రామాయంపేటలోని ఓ వ్యాపార సంస్థలో పని చేసేవాడు. రామాయంపేట మండలం రాయపూర్ గ్రామానికి మహమ్మద్ ప్రవీణ (19) రామాయంపేటలో టైలరింగ్ నేర్చుకోవడానికి వస్తుండేది. ఈ క్రమంలో ఇరువురికీ పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఈ విషయం రెండు రోజుల క్రితం బాలేష్ ఇంట్లో తెలియడంతో తల్లిదండ్రులు అతన్ని పని మానిపించారు. దీంతో బాలేష్, ప్రవీణలు తమ మతాలు వేరుకావటంతో పెద్దలు పెళ్లికి నిరాకరిస్తారని ఆందోళనకు గురయ్యారు. దీంతో శనివారం ఇరువురూ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. తాము పెళ్లి చేసుకోవడానికి పెద్దలు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించరని నిర్థారణకు వచ్చారు. కలిసి జీవించే అవకాశం లేనందున కలిసే మరణిద్దామని నిర్ణయించుకున్నారు. అనంతరం ఇద్దరూ కలిసి సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లి ఒకే చెట్టు కొమ్మకు ఉరి వేసుకున్నారు. కాగా, శనివారం నుంచి బాలేష్, ప్రవీణ కనిపించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో ఆదివారం ఝాన్సీ లింగాపూర్ శివారులో బాలేష్ బైక్ను గుర్తించిన స్థానికులు అతడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు అడవి ప్రాంతంలో గాలించగా ఇరువురూ ఆత్మహత్య చేసుకున్న సంగతి బయట పడింది.