ఆహార నిల్వలు తగినంత ఉండాలి
ఆపరేషన్ సింధూర్ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో అత్యవసర సర్వీస్లు అందించే విభాగాల ఉద్యోగుల సెలవులను రద్దు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అంతేకాకుండా ఉద్యోగులు అంతా అందుబాటులో ఉండాలని, మంత్రులు, అధికారులు అందరూ అందుబాటులో ఉండాలన్నారు. విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని సూచించారు. దేశ సైన్యంతో మనమంతా ఉన్నామనే సందేశం ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆపరేషన్ సిందూర్ సమీక్షా సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో మాట్లాడారు. ఈ సమయంలో రాజకీయాలు, పార్టీలకు తావులేదని స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు మీడియా, సోషల్ మీడియాలో అనవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉండేలా టోల్ ఫ్రీ నంబర్ ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి వచ్చి అనధికారికంగా నివసిస్తున్న వారిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
రక్త నిల్వలు దగ్గర ఉంచుకోండి
శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపైన కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు ఇచ్చారు. బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు సిద్ధం చేసుకోవాలన్నారు. అత్యవసర మెడిసిన్ సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్ల అందుబాటుపైనా ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవాలన్నారు. రెడ్ క్రాస్తో సమన్వయం చేసుకోవాలని, ఆహార నిల్వలు తగినంత ఉండేలా చూడాలని వెల్లడించారు. అన్ని జిల్లా కేంద్రాలతో పాటు సున్నిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండటంతో పాటు భధ్రతను పెంచాలన్నారు. ఐటీ సంస్థల దగ్గర భధ్రతను పెంచాలని, హైదరాబాద్ నగరంలో పోలీసులు చాలా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే పీస్ కమిటీ లతో మాట్లాడాలని, హిస్టరీ షీటర్ లపైన, పాత నేరస్తుల పట్ల పోలీస్ డిపార్ట్ మెంట్ అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు.
ఫేక్ వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు
సైబర్ సెక్యూరిటీ మీద అప్రమత్తంగా ఉండాలని, ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారిపైన ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఫేక్ న్యూస్ వల్ల ప్రజల్లో మరింత ఆందోళన పెరిగే అవకాశం ఉందన్నారు. ఫేక్ న్యూస్ను అరికట్టడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని సూచించారు. రాజధానిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేయాలన్నారు. అన్ని జిల్లా కేంద్రాలతో పాటు సున్నిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండటంతో పాటు భద్రతను పెంచాలని వివరించారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి అనధికారికంగా నివసిస్తున్న వారిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలని, కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమాచార వ్యవస్థ ను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు.
ఇక, హైదరాబాద్లోని అన్ని విదేశీ రాయబార కార్యాలయాల దగ్గర భద్రతను పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఐటీ సంస్థల దగ్గర భద్రతను పెంచాలని, హైదరాబాద్ నగరంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. అవసరమైతే పీస్ కమిటీలతో మాట్లాడాలని సంబంధిత అధికారులకు సూచించారు. పాత నేరస్తుల పట్ల పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు. భారత సైన్యానికి సంఘీభావంగా గురువారం సాయంత్రం 6 గంటలకు ర్యాలీ నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. సచివాలయం నుంచి నెక్లెస్ రోడ్ వరకు జరిగే ర్యాలీలో సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు, అధికారులు పాల్గొననున్నారు.