MODI ASKED ABSENTEES LIST
లోక్ సభ సమావేశాలకు హాజరు కాని భారతీయ జనతా పార్టీ ఎంపీలపై ప్రధాని మోడీ చాలా సీరియస్ గా ఉన్నారు. ఇక ఇప్పటికే సభకు రాణి వారిపై ఇది వరకే ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ మధ్య ఒక రోజు అయితే లోక్ సభలో సభ్యులు లేకపోవడంతో వాయిదా పడింది! సభ సజావుగా సాగాలంటే కనీసం కొంతమంది సభ్యులైనా సభలో ఉండాలి. అయితే ఎంపీలు ఎవరూ సభలో లేరు. దీంతో సభను వాయిదా వేసుకుని వెళ్లారు స్పీకర్! అలా సాగుతూ ఉంది లోక్ సభ.
అంతకన్నా మునుపే తమ పార్టీ ఎంపీలకు మోడీ ఒక గట్టి సూచన చేశారు. ఎంపీలంతా లోక్ సభకు హాజరు కావాలని.. చర్చల్లో పాల్గొనాలని మోడీ ఉద్భోదించారు. ప్రతి అంశంలోనూ అందరూ చర్చలో మమేకం కావాలని మోడీ సూచించారు. అయితే ఎంపీల తీరు మాత్రం మారలేదు. తాజాగా అయితే ఏకంగా కేంద్ర మంత్రులే లోక్ సభకు హాజరు కావడం లేదట. ఈ విషయం ప్రధానమంత్రి దృష్టికి వెళ్లినట్టుగా తెలుస్తోంది. లోక్ సభకు మెజారిటీ మంత్రులు హాజరు కావడం లేదని మోడీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే మోడీ హెచ్చరిక జారీ చేశారు. అయినా వారి తీరులో మార్పు లేదు.
అందుకే ఇప్పుడు మోడీ సభకు హాజరు కాని మంత్రుల జాబితాను ప్రత్యేకంగా తెప్పించుకున్నారని సమాచారం. సభకు హాజరు కాని మంత్రుల సమావేశాల సమయంలో సమాధానాలు ఇవ్వకుండా సహాయమంత్రులకు బాధ్యతలను అప్పగిస్తున్న వారి జాబితాను తయారు చేసి తనకు ఇవ్వాలని మోడీ ఆదేశాలు జారీ చేశారట. అయినా ప్రధాని ఇప్పటికే ఒకసారి హెచ్చరించినా బీజేపీ ఎంపీల మంత్రుల తీరు మారకపోవడం మాత్రం చర్చనీయాంశంగా మారుతోంది.