నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లా కేంద్రంలో హైదరాబాద్ రోడ్డు చంద్రగిరి విల్లాస్ కాలనీకి వెళ్లే దారి వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. శనివారం అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో సుమారు 20 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108 అంబులెన్స్ కు సమాచారమివ్వడంతో క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఆరెంజ్ ట్రావెల్స్కు చెందిన ఈ బస్సు హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మర్రిగూడ బైపాస్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రోడ్డుపై అడ్డంగా పెట్టిన బారికేడ్లను తప్పించబోయి బస్సు పల్టీ కొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 35 మంది ప్రయాణికులు గాఢనిద్రలో ఉండగా.. బస్సు పల్టీకొట్టడంతో వారంతా హాహాకారాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ ను క్రమబధ్దీకరించారు.