హైదరాబాద్ జూలై 2: హైదరాబాద్కు వచ్చాక ప్రజా చైతన్యం ప్రత్యక్షంగా చూసినట్లుందని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తెలిపారు. శనివారం జలవిహార్లో విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతుగా టీఆర్ఎస్ నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. కేసీఆర్ ఢిల్లీకి వచ్చి నాకు మద్దతు ప్రకటించారని సిన్హా పేర్కొన్నారు. అందరి ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్, కేటీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కేసీఆర్ వివరంగా చెప్పారని పేర్కొన్నారు. రాష్ట్రపతి ఎన్నికలు అసాధారణ పరిస్థితుల్లో జరుగుతున్నాయని.. దేశంలో పరిస్థితులు దిగజారుతుంటే చూస్తూ ఉండలేమన్నారు. విశాల భారత పరిరక్షణ కోసమే మా పోరాటమని యశ్వంత్ సిన్హా అన్నారు.అంతకముందు కేసీఆర్ మాట్లాడుతూ.. యశ్వంత్ సిన్హాకు తెలంగాణ ప్రజలు, ప్రజాప్రతినిధుల తరపున హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నామన్నారు. యశ్వంత్ సిన్హా ఉన్నత వ్యక్తిత్వం గలవారని, భారత రాజకీయాల్లో గొప్ప వ్యక్తి అని తెలిపారు. న్యాయవాదిగా కెరీర్ను ప్రారంభించారని, వివిధ హోదాల్లో దేశానికి అత్యుత్తమ సేవలందించారని పేర్కొన్నారు. ఆర్థిక మంత్రిగా పనిచేశారని, ఆయనకు అన్ని రంగాల్లో విశేష అనుభవముందని తెలిపారు. దేశంలో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉందని, అందుకే.. పార్లమెంటేరియన్లంతా ఆత్మ ప్రభోదానుసారం యశ్వంత్ సిన్హాకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు సీఎం కేసీఆర్.