Pawan Kalyan To Visit Amaravati Tomorrow
అమరావతి ప్రాంతంలో పవన్ కళ్యాన్ పర్యటన నేపధ్యంలో మరోమారు రాజధాని ఆందోళనలు మిన్ను ముట్టనున్నాయి మరోసారి రాజధాని అమరావతిలో టెన్షన్ వాతావరణం ఏర్పడుతోంది. సుమారు 60 రోజులుగా రాజధానిపై ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నా.. ఇటీవల కాలంలో పెద్ద నాయకుల రాకపోకలు తగ్గిపోవడంతో సాధారణ స్థితికి చేరుతున్నట్లు కనిపించింది. ఈ నేపథ్యంలో శనివారం నాడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో పర్యటించేందుకు రెడీ అవుతున్నారు. శనివారం ఉదయాన్నే మంగళగిరికి చేరుకుని, ఆ తర్వాత రాజధాని గ్రామాల్లో పర్యటనకు వెళ్లనున్న నేపధ్యంలో మళ్ళీ అమరావతిలో వేడి పుడుతుంది .
అమరావతి ఏరియాలోని పలు గ్రామాల్లో రైతులు, మహిళలు పలు చోట్ల నిరాహార దీక్షా శిబిరాలను కొనసాగిస్తున్నారు. తరచూ చిన్నా, చితకా కార్యక్రమాలతో ప్రభుత్వానికి తమ అభిమతాన్ని తెలియజెప్పేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం పర్యటించనున్న పవన్ కల్యాణ్.. దీక్షా శిబిరాలలో వున్న రైతులకు సంఘీభావం తెలుపనున్నారు. ఉదయం మంగళగిరిలోని జనసేన కార్యాలయం నుంచి పవన్ కల్యాణ్ బయలుదేరి.. యర్రబాలెం, పెనుమక, రాయపూడి, తుళ్లూరు గ్రామాల్లో పర్యటిస్తారు. అనంతవరం వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు పర్యటించనున్న పవన్ కల్యాణ్ వెంట నడిచేందుకు జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సమాయత్తం అవుతున్నట్లు సమాచారం. గతంలో పోలీసుల దాడిలో గాయపడిన రైతులను పవన్ కల్యాణ్ పరామర్శించనున్నారు. రైతుల కోరిక మేరకే ఆయన ఈ పర్యటనకు పూనుకున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి.