Pawan Kalyan Warning To YCP Govt Over 3 Capital
ఏపీకి అమరావతి శాశ్వత రాజధాని అని దానిని ఎవరూ మార్చలేరని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు .మూడు రాజధానుల ప్రకటన చేసి అసెంబ్లీలో బిల్లు ఆమోదించిన నేపధ్యంలో ఆయన వైసీపీపై నిప్పులు చెరిగారు. అమరావతి ప్రాంత రైతాంగంపై లాఠీలు ఝళిపిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి, ఆ పార్టీకి సర్వ నాశనానికి నాంది పడిందని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. నోరు తెరిచి అడగలేని మూగ రైతులపై కూడా పోలీసులు లాఠీలతో దాడి చేసిన పరిస్థితి హృదయవిదారకమని అభిప్రాయపడ్డారు. అమరావతి ప్రాంతం నుంచి మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి భారీగా తరలి వచ్చిన రైతులు, ప్రజలను ఉద్దేశించి పవన్ కల్యాన్ ఉద్వేగంగా మాట్లాడారు.
వైసీపీ నేతలకు శాపనార్థాలు పెట్టారు. బుధవారం నాడు తాను ఢిల్లీ వెళుతున్నానని, బీజేపీ అధినేతలతో మాట్లాడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రెండు పార్టీలు కలిసి నిర్వహించే భారీ ఆందోళనకు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. అధికారం చేపట్టిన అహంకారంతో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో దాని పర్యవసనాలను చవి చూడాల్సి వస్తుందని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.అమరావతి ఏరియా ప్రజలను మోసం చేసిన వైసీపీ నేతలు రేపు కడప, విశాఖ, కర్నూలు ప్రజలను కూడా మోసం చేస్తారని, ఇవాళ అమరావతి ప్రాంత ప్రజల ఘోషను అర్థం చేసుకోలేని ప్రతీ ఒక్కరు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా అమరావతి ప్రాంత ప్రజల ఉద్యమానికి రాష్ట్రప్రజలంతా అండగా నిలబడాలని కోరారు.