PEOPLE SUPPORT INCREASED TO RAHUL
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ అధికారం కోల్పోయి, యూపీఏ అధికారంలోకి వస్తే.. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధానిగా పగ్గాలు స్వీకరించాలని 52 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఇండియా టుడే– కార్వీ సంస్థలు సంయుక్తంగా మూడ్ ఆఫ్ ది నేషన్ (ఎంవోటీఎన్) పేరుతో నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. రాహుల్ తర్వాతి స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మమతా బెనర్జీ నిలిచారు. 44 శాతం మంది ఆమె ప్రధాని కావాలని కోరుకున్నారు. బహుజన సమాజ్వాదీ పార్టీ అధినేత్రి మాయావతి, సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వైపు చాలా తక్కువ మంది మాత్రమే మొగ్గుచూపారు. నరేంద్ర మోదీకి కేజ్రీవాల్ ప్రత్యామ్నాయం కాగలరని కేవలం 4 శాతం మంది మాత్రమే అభిప్రాయపడ్డారు. అఖిలేశ్ యాదవ్కు ఐదు శాతం మంది మద్దతు తెలిపారు. మాయావతి ప్రధాని కావాలని 3 శాతం మంది కోరుకున్నారు.
అయితే మళ్లీ ప్రధానిగా మోదీయే ఉండాలని 46 శాతం మంది కోరుకోగా, 34 శాతం మంది రాహుల్ గాంధీవైపు మొగ్గుచూపారు. ఇచ్చిన హామీని మోదీ నిలబెట్టుకోలేకపోయారని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. మోదీ పాలనతో తమకు మంచి రోజులు వచ్చాయని కేవలం 33 శాతం మంది మాత్రమే పేర్కొన్నారు. ఆర్థిక నిర్వహణలో కాంగ్రెస్ పాలనతో పోల్చుకుంటే మోదీ ప్రభుత్వమే నయమని దాదాపు సగం శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. మోదీ ప్రారంభించిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన (ఉచిత గ్యాస్ కనెక్షన్), స్వచ్ఛ భారత్ అభియాన్(మరుగుదొడ్ల నిర్మాణం) పథకాలు ప్రజల్లో బలమైన ముద్ర వేశాయని సర్వేలో వెల్లడైంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి అధికారం దక్కడం కష్టమనే విషయం ఇటీవలి సర్వేల్లో వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీపై వ్యతిరేకత పెరగడం.. అదే సమయంలో రాహుల్ నాయకత్వంపై ప్రజలు మొగ్గు చూపడం కమలనానథుల్లో కంగారు తెప్పిస్తోంది.