- రెన్యువల్ చేసుకోమని సెప్టెంబరులో చెప్పాం
- స్పష్టం చేసిన మంత్రి పేర్ని నాని
తెలుగు సినిమా పంపిణీదారులు తమ సమస్యలపై మంత్రి పేర్ని నానిని మంగళవారం కలిశారు. 13 జిల్లాల నుండి ప్రతినిధులు, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామెర్స్ కార్యదర్శి, వీరు నాయుడు తదితరులు పాల్గొన్నవారిలో ఉన్నారు. తాము సినిమాలలో పెట్టుబడి పెట్టాం. ఈ మధ్య ఉన్న సమస్యల పై చర్చించాం. కార్పొరేషన్ లో కనిష్టంగా ఏసీ థియేటర్లు లో రూ. 50 గరిష్టంగా రూ. 150 ఆడిగాం. అన్ని కేటగిరీలు లో రేట్లు పెంచాలని కోరాం. ఎగ్జిబిటర్లు అనుమతులు లేకుండా కొన్ని థియేటర్లు నడిపారు. లైసెన్స్ లు పునరుద్ధరించేందుకు 4 వారాల సమయం ఆడిగాం. అవి మూసేస్తే మాకు వ్యాపారం నష్టం వాటిల్లుతుంది. అందుకే వారి తరఫున మేము ప్రభుత్వాన్ని కోరామని సినిమా ప్రతినిధులు తెలిపారు.
అనంతరం మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. సినిమా టికెట్ల ధరలు పెంచమని వారు అడిగారని.. ఇది ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. నిన్ననే హైకోర్టు ఆదేశం మేరకు ఓ కమిటీ ని నియమించామని.. అందులో సినిమా స్టేక్ హోల్డర్ల నుండి సభ్యులు ను నియమించామని చెప్పారు. అందరి విజ్ఞప్తి లను పరిగణలోకి తీసుకుంటామని.. ప్రజలకి, సామాన్యుడికి భారం పడకుండా ఉండాలన్నదే తమ ఉద్దేశ్యమని తెలిపారు. ఈ సమస్యలన్నింటిని కమిటీ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
హీరో నాని, సిద్దార్థ్ లకు మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. మాట్లాడేవాళ్ళు తెలిసి మాట్లాడుతున్నారో.. తెలియక మాట్లాడుతున్నారో తెలియదని అన్నారు. సెప్టెంబరులో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు తో సమావేశం పెట్టామన్నారు. ఆ రోజే సినిమా హాళ్ల యజమానులు అనుమతులు, ఫైర్ ఎన్ఓసీలు తీసుకోవడం లేదని, వాటిని రెన్యూవల్ చేసుకొమ్మని సెప్టెంబర్ లోనే చెప్పామన్నారు. అయినా అనుమతులు లేకుండా నడిపారని.. అనుమతులు తీసుకొని థియేటర్లపై చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇందులో ఎవరి మీదనో కక్ష ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. 130 సినిమా హాళ్ల పై చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ఇవన్నీ నిబంధనలు ఉల్లంఘించిన థియేటర్లేనని స్పష్టం చేశారు. చిత్తూరులో 24, కృష్ణలో 12 సీజ్ చేసామన్నారు. లైసెన్స్ లేని వాళ్ళు 22 థియేటర్లు మూసేశారని, 83 థియేటర్లను సీచ్ చేశామని, 23 థియేటర్లపై జరిమానా విధించామని వెల్లడించారు. జీవో 35 ని ఏప్రిల్ లో ఇచ్చామని గుర్తుం చేశారు. మరి ఈరోజు ఆ జీవో కి నిరసనగా మూసివేయడమేమిటని ప్రశ్నించారు. నాని ఏ ఊరు లో ఉన్నారో.. ఆయన ఏ కిరాణా కొట్టు లెక్కలు లెక్కపెట్టారో తెలియదని విమర్శించారు.
ప్రజలకు మేలు చేయాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని మరోసారి స్పష్టం చేశారు. ఎవరితోనైనా ప్రభుత్వం చర్చలు జరపడానికి సిద్ధంగా ఉందన్నారు. ఇండస్ట్రీ కి సంబంధించి ఏ సమస్య అయినా వినడానికి మేం సిద్ధమని తెలిపారు. ప్రభుత్వానికి ఎదో అపాదించి మాట్లాడటం ధర్మం కాదని హితువు పలికారు. ఎవరో ఒకరి కోసం మేం చేస్తామా? సినిమా ఇండస్ట్రీ అంటే ఒక్కరేనా అని ప్రశ్నించారు. గతంలో బామ్మర్ది తీసే సినిమాకి రాయితీ ఇచ్చారని.. కానీ చిరంజీవి తీస్తే రాయితీ ఇవ్వలేదని గుర్తు చేశారు. కానీ, సీఎం జగన్ అందరిని ఒకేలా చూస్తారని చెప్పారు.