POLICE NOTICE TO BIGBOSS3
- ఆరు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని పోలీసుల ఆదేశం
- జర్నలిస్ట్ శ్వేతారెడ్డి ఫిర్యాదుపై విచారణ
ఆరంభం నుంచి వివాదాలు, ఆరోపణలతో వార్తల్లో నిలిచిన రియాల్టీ షో ‘బిగ్ బాస్’కు ఇబ్బందులు కొనసాగుతున్నాయి. జర్నలిస్ట్ శ్వేతారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ ముమ్మరం చేసిన బంజారాహిల్స్ పోలీసులు.. ఆ కార్యక్రమ నిర్వాహకులకు నోటీసులు జారీచేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్–2లోని స్టార్ మా కార్యాలయ అడ్మిన్ హెడ్ శ్రీధర్కు నోటీసులిచ్చారు. ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్-3పై ఫిర్యాదులు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కార్యక్రమం వెనుకాల క్యాస్టింగ్ కౌచ్ ఉందని, తనకు ఇలాంటి అనుభవం ఎదురైందని చెబుతూ ఈనెల 13న శ్వేతారెడ్డి.. బిగ్బాస్ కార్యక్రమ ఇన్ఛార్జ్ శ్యామ్తో పాటు రవికాంత్, రఘు, శశికాంత్లపై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బిగ్బాస్ను ఎలా సంతృప్తి పరుస్తారంటూ ప్రశ్నించడం తదితర అంశాలను ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ పోలీసులు వారిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తలో భాగంగా స్టార్ మా కార్యాలయం అడ్మిన్ శ్రీధర్కు నోటీసులు అందజేశారు. ఆరు ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని అందులో సూచించారు. అగ్రిమెంట్ వ్యవహారం, ఎంపిక, ఎంపిక నిబంధనలు, శ్యామ్తో పాటు మిగిలిన ముగ్గురి పాత్ర, తదితర అంశాలపై మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు. అయితే శ్యామ్, రవికాంత్, రఘు, శశికాంత్లతో తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదంటూ స్టార్ మా కార్యాలయం నిర్వాహకులు పోలీసుల దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం. దీంతో కేసు కొత్త మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.