Politicians Lost Because of Social Media
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల చిత్రాలు కడు విచిత్రంగా ఉన్నాయి. మొన్నటికి మొన్న పంచాయతీ ఎన్నికల్లో డబ్బులు తీసుకుని తనకు ఓటు వెయ్యలేదని తిరిగి తన డబ్బులు తనకు ఇచ్చేయాలని ఇంటింటికి తిరుగుతూ రికవరీ మొదలుపెట్టిన ఒక అభ్యర్థి అందరినీ షాక్ కి గురి చేస్తే, ఇక తాజాగా ఇంకో అభ్యర్థి వాట్సాప్ మెసేజ్ వల్ల, సోషల్ మీడియాలో తనపై జరిగిన ప్రచారం వల్ల తాను ఓడిపోయానని తనకు న్యాయం చేయమని కోర్టు మెట్లెక్కాడు.
పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన ఓ అభ్యర్థి అనూహ్యమైన పిటిషన్ తో తెలంగాణ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వాట్స్ అప్ మెసేజ్ – ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన తప్పుడు ప్రచారాలతో తాను సర్పంచ్ గా ఓడిపోయాను అని వాపోయాడు. తనకు న్యాయం చేయాలని హైకోర్టుని ఆశ్రయించాడు. కుక్క రాంచందర్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని సోమగూడెం నూతన గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన కుక్క రాంచందర్ కథనం మేరకు… బెల్లంపల్లి మండలంలోని సోమగూడెం నూతన గ్రామ పంచాయితీలో సర్పంచ్ ఎన్నికల్లో కుక్క రాంచందర్ పోటీలో ఉండగా ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం పలువురు వాట్స్ అప్ గ్రూప్ లో సర్పంచ్ అభ్యర్థి రాంచందర్ పై ఆరోపణలు చేస్తూ మెసేజ్ తో పాటు ఫేస్ బుక్ లో కూడా పోస్ట్ చేసారు. గెలుపు రేసులో ఉన్న నేను ఈ పోస్ట్ లతో నాపై తప్పుడు ప్రచారం జరగడం వల్ల ఓడిపోయాను అని పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి ఉన్న సమయం లో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి నా ఓటమికి కారణం ఐన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు రీ ఎలక్షన్స్ నిర్వహించి తనకు న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించినట్లు కుక్క రాంచందర్ పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదుపై తదుపరి వాదనల తర్వాత తీర్పు వెలువడనుంది. మొత్తానికి చిత్రవిచిత్రమైన అంశాలు, ఫిర్యాదులు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో చోటు చేసుకోవడం గమనార్హం.