SAMARA SENKKARAVAM IN KADAPA
ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. సభలు, సమావేశాలతో ప్రధాన పార్టీలు హోరెత్తిస్తున్నాయి.రానున్న ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులను కార్యోన్ముఖులను చేసేందుకు నిర్వహిస్తున్న సమర శంఖారావం సభలలో జగన్ సంచలన ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పటికే రేణిగుంట లో నిర్వహించిన సభలో రాబోయే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న వృధ్దాప్య ఫించన్ ను రూ. 3 వేలకు పెంచుతానని వైసీపీ అధినేత జగన్ చెప్పారు. ఈ నేపథ్యంలో జగన్ నిర్వహిస్తున్న సమర శంఖారావం సభలపై అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది.
పాదయాత్ర తరువాత వైసీపీ అధినేత వైయస్ జగన్ సమరశంఖారావంతో ప్రజల మధ్య కొచ్చారు. కేడర్ను కార్యోన్మోఖులను చేసేందుకు సమరశంఖారావం సభలు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా బుధవారం తిరుపతిలోని రెండు సమరశంఖారావం సభల్లో పాల్గొన్నారు.. ఈ క్రమంలో నేడు కడప మున్సిపల్ స్టేడియంలో నిర్వహించే సమరశంఖారావం వైఎస్ జగన్ పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. హైదరాబాద్ నుంచి కడపకు విమానంలో రానున్న ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదయం 11 గంటలకు కడపకు సమీపంలోని గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాలలో తటస్థులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం మ. 1 గంటకు బూత్ కమిటీ కన్వీనర్లు, పార్టీ శ్రేణులతో కడప మున్సిపల్ స్టేడియంలో సభ ఏర్పాటు చేశారు. ఏ బహిరంగ సభలకూ లేని విధంగా ఈ సభకు ఇలాంటి ప్రత్యేక సదుపాయం కల్పించారు. ప్రతి నియోజకవర్గం నుంచి 2,500 మంది చొప్పున 25 వేల మందికి ఏర్పాట్లు చేశారు. జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాల వారికి ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఇదిలావుంటే తిరుపతి సభలో పింఛన్లు రెట్టింపు చేస్తామని ప్రకటించిన జగన్.. నేడు మరో సంచలన నిర్ణయం ప్రకటిస్తారని కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు.