Survey Shock For NDA Alliance.. ఈ సారి కష్టమే
దేశంలో ఎన్నికల సందడి నెలకొంది. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అటు జాతీయ పార్టీలు ,ఇటు ప్రాంతీయ పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని, తిరిగి అధికారం దక్కించుకోవాలని బిజెపి ప్రయత్నం చేస్తుంటే, ఈసారి కేంద్రంలో బిజెపి ని గద్దె దించాలని భావిస్తోంది. అయితే గత నాలుగున్నరేళ్లుగా బిజెపి సాధించిన పాలనపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రజా వ్యతిరేకత విపరీతంగా పెరిగింది. ఇక ఈ తరుణంలో వచ్చే ఎన్నికల్లో బిజెపికి ఎదురీత తప్పదని తెలుస్తోంది. ఇక అదే విషయాన్ని ఇప్పటివరకు నిర్వహించిన ఒపీనియన్ పోల్స్ తెలియజేశాయి. మొన్నటికి మొన్న రిపబ్లిక్ డే సర్వే, ఏ బి పి సి ఓటర్ సర్వే, ఇండియా టుడే సర్వే ఇప్పుడు తాజాగా టైమ్స్ నౌ సర్వే ప్రతి సర్వేలోనూ ఎన్ డి ఏ కూటమి ఈసారి స్పష్టమైన మెజారిటీ సాధించే అవకాశం ఏ మాత్రము లేదు అనే విషయాన్ని వెల్లడిస్తున్నాయి.
ఇక తాజాగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారానికి 20 సీట్ల దూరంలో నిలుస్తుందని ఆంగ్ల వార్తాచానెల్ ‘టెమ్స్ నౌ’.. వీఎంఆర్ సంస్థ సర్వే తేల్చింది. ఈ సంస్థ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వచ్చే ఫలితాలపై సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో జనవరి 14 నుంచి 25వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 15, 731 మంది ఓటర్ల నుంచి అభిప్రాయాలు సేకరించింది. అందులో ఎన్డీయేకు 252, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు 147, ఈ రెండు కూటముల్లోనూ లేని ఇతర పార్టీలకు 144 ఎంపీ సీట్లు వస్తాయని ఆ సర్వే అంచనా వేసింది. ఇక తెలంగాణలో అధికార టీఆరెస్, ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుందని వెల్లడించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణాలో మొత్తం 17 లోక్సభ స్థానాలకు గాను 10 టీఆరెస్, కాంగ్రెస్ 5 , బీజేపీ 0- 1, ఇతరులు 1 గెలుకుంటాయని వెల్లడించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 25 లోక్సభ స్థానాలకుగాను వైఎస్సార్సీపీకి 23, టీడీపీ 2 సీట్లు దక్కుతాయని వెల్లడించింది. అటు జాతీయపార్టీలు బీజేపీ, కాంగ్రెస్లు ఒక్క స్థానంలో కూడా గెలవలేవని తెలిపింది.