TELANGANA CABINET EXPANSION DELAYED FEW DAYS
అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న కేబినేట్ విస్తరణ సంక్రాంతి తర్వాత జరుగుతుందని అనుకుంటే తెలంగాణలో కేబినెట్ విస్తరణ మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నట్టు టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఒకే రకమైన శాఖలను ఏకతాటి మీదకు తీసుకొచ్చిన తర్వాత కేబినెట్ను విస్తరించాలని కేసీఆర్ భావిస్తున్నట్టుగా సమాచారం. సంక్రాంతి తర్వాత కేసీఆర్ కేబినెట్ ను విస్తరిస్తారని భావించారు. ఈ నెల 18వ తేదీన కేసీఆర్ మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉందని తొలుత ప్రచారం సాగింది. తొలి విడతలో ఎనిమిది మందికి ఛాన్స్ దక్కే అవకాశం ఉందని ప్రచారం సాగింది.కానీ, కేసీఆర్ ప్లాన్ మారినట్టుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. గత టర్మ్లోనే ఒకే తరహాలో ఉన్న శాఖలను విలీనం చేయాలని కేసీఆర్ ప్లాన్ చేశారు. కానీ సాధ్యం కాలేదు. ఈ టర్మ్లో ఈ శాఖల విలీనం ప్రక్రియను చేపట్టారు.
ఒకే స్వభావం ఉన్న శాఖలను విలీనం చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కె జోషీ, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, , రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు రాజీవ్ శర్మకు అప్పగించారు. మరోవైపు ప్రభుత్వ శాఖల తరహాలోనే ఒకే స్వభావం కలిగిన కార్పొరేషన్లు, ఫెడరేషన్లను ఒకే గొడుగు కిందికి తేవాలని సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించారు.లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఈ దఫా పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టే ఛాన్స్ లేదు.
కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. తెలంగాణ రాష్ట్రం కూడ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నట్టు కూడ కేసీఆర్ ప్రకటించారు. అనేక పథకాలు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ తో ముడిపడి ఉన్నాయి. బడ్జెట్ స్వరూపం తేలక ముందే కేబినెట్ విస్తరణ చేస్తే మంత్రులు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయే అవకాశం ఉందని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేబినెట్ విస్తరించాలని కేసీఆర్ ఆలోచనగా ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.