TELANGANA PAC CHAIRMAN ALMOST FINAL
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో అసెంబ్లీ లో ప్రతిపక్ష పార్టీ నిర్వహించే పదవుల పందేరం జరుగుతుంది. ఇప్పటికే శాసన సభాపక్ష నేతగా భట్టి విక్రమార్క ను ప్రకటించారు. ఇక అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీకి లభించే ప్రజా పద్దుల కమిటీ నిర్వహించే పీఏసీ చైర్మన్ పదవి కాంగ్రెస్కు దక్కనుంది. 19 మంది శాసనసభ్యులతో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఈ పదవి కాంగ్రెస్ చెందిన సీనియర్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. వనమా కొత్తగూడెం నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్లో ఉత్తమ్కుమార్రెడ్డి తర్వాత ఎక్కువ సార్లు గెలుపొందిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో సీనియర్ వనమా. పీసీసీ అధ్యక్షుడిగా ఓసీ వర్గానికి చెందిన ఉత్తమ్ ఉండటంతో సీఎల్పీ నేతగా ఎస్సీ ఎమ్మెల్యే భట్టి విక్రమార్కను ఎంపిక చేయడం, పీఏసీ చైర్మన్ పదవిని బీసీ వర్గానికి కేటాయిస్తారని, అది కూడా బీసీల్లో సీనియర్ ఎమ్మెల్యే అయిన వనమానే పీఏసీ పదవికి ఎంపిక చేస్తారని పార్టీలో చర్చ జరుగుతోంది.
ప్రతిపక్ష పార్టీలో ఎక్కువ సార్లు గెలిచిన సీనియర్ ఎమ్మెల్యేకు పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం సాంప్రదాయంగా వస్తుంది. గతంలో నారాయణ్ఖేడ్ నియోజకవర్గం నుంచి 4 సార్లు గెలిచిన పి.కిష్టారెడ్డి, పాలేరు నుంచి ఐదుసార్లు గెలుపొందిన రాంరెడ్డి వెంకటరెడ్డి, జహీరాబాద్ నుంచి గెలుపొందిన గీతారెడ్డి ఈ పదవిని నిర్వర్తించారు. సీఎల్పీ నాయకుడిగా భట్టి విక్రమార్క ను పార్టీ అధిష్టానం నిర్ణయించడంతో అసెంబ్లీలోని ఇతర పదవులపై పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. పార్టీ ఉపనేతలుగా ఎవరిని నియమిస్తారన్నది చర్చనీయాంశమైంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి ఉపనేత పదవి ఖరారైనట్టు తెలుస్తోంది. ఆయనతో పాటు ఎస్టీ మహిళా కోటాలో సీతక్క, సీనియర్ ఎమ్మెల్యేగా సబిత, గండ్ర వెంకటరమణారెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి. సీఎల్పీ కార్యదర్శి, విప్ పదవులకు పార్టీ తరఫున పొడెం వీరయ్య, చిరుమర్తి లింగయ్య, ఆత్రం సక్కు, రేగా కాంతారావు, జగ్గారెడ్డి, సుధీర్రెడ్డిలతో పాటు హరిప్రియా నాయక్ పేరు కూడా వినిపిస్తోంది.