* ప్రాజెక్టులను ఎక్కడ పూర్తి చేశావు చిన్న దొర?
* 30 పెండింగ్ ప్రాజెక్టుల పై బహిరంగ చర్చకు సిద్ధమా
* జలయజ్ఞం ప్రాజెక్టులపై
సవతి తల్లి ప్రేమ ఎందుకు?
* 2015లో అసెంబ్లీ వేదికగా పూర్తి చేస్తామని
పెద్దదొర వేదాలు వల్లించిన మాట నిజం కాదా?
* కాళేశ్వరం కరెంట్ బిల్లుల మందం కేటాయించినా
16 ప్రాజెక్టులు పూర్తయ్యేవి కదా?
* కమీషన్ల కాళేశ్వరం తప్ప
మీరు పూర్తి చేసింది ఏమిటి?
తెలంగాణలో పెడింగ్ ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేసినం, నీళ్ల కష్టాలు లేవంటూ చిన్న దొర కేటీఆర్ పచ్చి అబద్దాలు చెబుతున్నారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టుగా రీ డిజైన్ చేసి రూ. లక్షా 20 వేల కోట్లు ఖర్చు చేసి 57 వేల ఎకరాలకు సాగు నీరు ఇచ్చారు తప్పితే… రాష్ట్రంలో పెండింగులో ఉన్న ఏ ప్రాజెక్టును సైతం పట్టించుకోలేదన్నారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే తెలంగాణలో ప్రతి ఎకరాకు సాగు నీరు అందించే విధంగా 33 ప్రాజెక్టులకు మహానేత వైయస్ఆర్ శంకుస్థాపనలు చేశారని.. 2016-17 నాటికే ప్రాజెక్టులు అన్ని పూర్తి చేసే విధంగా పనులు సైతం వేగంగా జరిగాయన్నారు. ఇంకా ఆమె ఏమన్నారంటే వైఎస్ షర్మిల మాటల్లోనే..
అలీసాగర్, గుత్పా, గడ్డెన్న సుద్దవాగు లాంటి ప్రాజెక్టులు 2007 వరకు పూర్తి చేశారు. దేవాదుల, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులు 70 శాతం, మిగిలిన ప్రాజెక్టులు 90 శాతం పనులు పూర్తి కావొచ్చాయి. అయితే 2009లో వైయస్ఆర్ మరణానంతరం అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ గానీ.. 2014లో అధికారంలోకొచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గాని పెండింగ్ ప్రాజెక్టులను పట్టించుకున్నది లేదు. 2015లో అసెంబ్లీ వేదికగా పెద్ద దొర కేసీఆర్ చెప్పిన మాట.. కేవలం రూ. 8500 కోట్లు ఖర్చు చేస్తే 16 పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసుకోవచ్చు, 35 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని వేదాలు వల్లించారు. అయితే 90 శాతం పూర్తయిన ప్రాజెక్టుల్లో మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేసేందుకు అవసరం అయిన నిధులు విడుదల చేయకుండా జలయజ్ఞం ప్రాజెక్టులపై కేసీఆర్ సవతి తల్లి ప్రేమ చూపెట్టారు.పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా తెలంగాణను ఎడారిగా మార్చింది పోయి కోటి ఎకరాలకు సాగు నీరు ఇచ్చామని నీతులు చెప్తున్నారు. పెద్ద దొర కేసీఆర్, చిన్నదొర కేటీఆర్ కు ఒక సవాల్ విసురుతున్నాం. తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేశాం అని మీరు అంటున్నారు. పూర్తి కాలేదని ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందని మీము అంటున్నాం. ప్రజాక్షేత్రంలో బహిరంగ చర్చకు తండ్రి కొడుకులు రాగలరా?
తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టుల వివరాలు
* ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు తట్టెడు మట్టి కూడ మోయలేదు
* నల్గొండ జిల్లాలో SLBC,డిండి,బ్రాహ్మణ వెల్లేముల,ఉదయసముద్రం,అడవిదేవుల పల్లి,సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం (8లిఫ్టులు) పూర్తి కాలేదు
* పాలమూరు జిల్లాలో, పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి, భీమా ఫేజ్ 1, 2, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, సంగంబండ, భూత్పూరు ప్రాజెక్టులు పూర్తి కాలేదు
* ఆదిలాబాద్ జిల్లాలో చనాక-కొరాట, జగన్నాథపురం, కొమురంభీం, వార్థా, కుఫ్టి, చెన్నూరు లిఫ్ట్, గూడెం లిఫ్ట్, గొల్లవాగు, నీల్వాయి ప్రాజెక్టులకు అతీగతీ లేదు
* నిజామాబాద్ జిల్లాలో కాళేశ్వరం ప్యాకేజీ 20,21,22 , లెండి ప్రాజెక్టులు పెండింగ్
* కరీంనగర్ జిల్లాలో ప్యాకేజి 9, సూరమ్మ చెరువు ప్రాజెక్టు, రోళ్లవాగు ప్రాజెక్టులు పెండింగ్
* వరంగల్ జిల్లాలో దేవాదుల, చిన్న కాళేశ్వరం, గుండవాగు, ఆకేరువాగు, పాలెంవాగు, ఆకేరువాగు, పాలకుర్తి, చెన్నూరు, మోడి కుంట ప్రాజెక్టులు పెండింగ్
* మెదక్ జిల్లాలో సింగూరు కాలువల ఆధునీకరణ, ఘనపూర్ ఆనకట్ట ఎత్తు పెంపు పెండింగ్
ఓట్ల కోసం సాగు నీరు ఇచ్చామని అబద్దపు మాటలతో రాజకీయం చేసే అయ్యా కొడుకులు ఈ పెండింగ్ ప్రాజెక్టుల మీద వివక్ష ఎందుకు చూపెట్టారో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. మీ కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే కట్టిన మూడేళ్లకే మునిగిపోయిందని విమర్శించారు. కాళేశ్వరం ద్వారా 57 వేల ఎకరాలకే సాగు నీరు ఇస్తే.. ఆ ప్రాజెక్టులో నడిచే మోటర్లకు కట్టే కరెంట్ బిల్లుల మందం కేటాయించినా ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవన్నారు. దాదాపు 30 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరు అందేదని.. ఈ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా తండ్రీకొడుకులు చేసిన మోసం అంతా ఇంతా కాదని విమర్శించారు.