Tow were died Because of Cock Fight Game
కోడి పందాల సరదా రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. కోర్టులు ఎన్నిసార్లు హెచ్చరించినా పోలీసులు ఎంత నిఘా పెట్టినా, కోడిపందాల నిర్వహణను మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. ఏటా సంక్రాంతి వస్తుందంటే చాలు కోస్తాలో ఎక్కడికక్కడే భారీగా కోడిపందాలను నిర్వహిస్తుంటారు. కృష్ణా జిల్లాలో కోడిపందాల సరదా రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.
ఏపీలో కోడి పందాలు విషాదాన్ని నింపాయి. కృష్ణా జిల్లాలో కోడిపందాల స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. చాట్రాయి మండలం చిత్తపూరు గొల్లగూడెంలో కోడిపందాలు ఆడుతున్నారన్న సమాచారం పోలీసులకు అందింది. పోలీసులు వస్తున్నారన్న సమాచారంతో పందెంరాయుళ్లు తప్పించుకునేందకు పరిగెత్తారు. ఇద్దరు యువకులు అదుపు తప్పి వ్యవసాయబావిలో పడ్డారు. బావిలో నీళ్లు ఎక్కువగా ఉండటం బయటకు వచ్చే మార్గం లేకపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. మృతులు చిట్టూరి శ్రీనివాసరావు, మేకల చెన్నకేశవరావుగా గుర్తించారు.
సంక్రాంతి సంబరాలు మొదటి రోజునే ఇలా జరగటంతో చిత్తపూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పందాలు వేయకుండా సంప్రదాయంగానే కోడి పందాలు ఆడుతున్నాం అంటున్నారు గ్రామస్తులు. పోలీసులు ఓవరాక్షనే యువకుల మృతికి పోలీసులే కారణం అంటూ ఆందోళనకు దిగారు. యువకుల మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. సంక్రాంతి పండుగ సంబరాలు మొదలైన రోజే జరిగిన విషాదంతో కోడి పందాలరాయుళ్లలో టెన్షన్ మొదలైంది. పందాలను హైకోర్టు నిషేధించడంతో వీటి అనుమతి నిర్వహణకు అనుమతి లేదని ఆంక్షలు ఉన్నాయని ఖాకీలు చెబుతుంటే ఈ వివాదం ఎంత దూరం వెళుతుందో అనే ఆందోళన గ్రామాల్లో నెలకొంది.