దిద్దుబాటు చర్యల్లో కాంగ్రెస్
తెలంగాణా ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇప్పటికే పార్టీ క్యాడర్ లో నిరాశా నిస్పృహలు అలముకుంటున్న తరుణంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తోంది. పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఘోరం గా పరాజయం పొంది పరాభవం పాలైన నేపధ్యంలో జిల్లా అధ్యక్షులను మార్చాలని నిర్ణయం తీసుకుంది.
రానున్న ఎన్నికల నేపధ్యంలో తెలంగాణలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రయత్నాలను ప్రారంభించింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సహా చాలా మంది పోటమి పాలైన నేపధ్యంలో పోస్ట్ మార్టం చేసిన కాంగ్రెస్ పార్టీ కొత్త నాయకత్వాన్ని రంగంలోకి దింపాలని భావిస్తోంది. అందులో భాగంగా కొత్తగా డీసీసీ అధ్యక్షుల నియామాకాన్ని చేపట్టనుంది. వచ్చే ఐదేళ్ల వరకు పార్టీని కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సమర్థులైన వారికి ఈ బాధ్యతలను అప్పగించాలని భావిస్తోందని తెలుస్తోంది.
తెలంగాణలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం నుండి పార్టీ నేతలు ఇప్పుడిప్పుడే కోలుకొంటున్నారు. కీలక నేతలు సైతం ఓటమితో షాక్ లో ఉన్నారు. వారు సైతం పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. ఓటమి పాలైన కీలక నేతలకు ఎంపీగా అవకాశం ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం చెప్పిన నేపధ్యంలో వారు కార్యక్షేత్రంలోకి దిగేందుకు సిద్ధం అవుతున్నారు. పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టారు. ఢీల్లీకి పీసీసీ చీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని రావాలని పార్టీ నాయకత్వం ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఉత్తమ్ గురువారం ఢిల్లీకి చేరుకొన్నారు. అక్కడ ఆయన డీసీసీ అధ్యక్షుల నియామకం పై అధిష్టానంతో చర్చలు జరుపుతారు. పార్లమెంటరీ నియోజకవర్గాల ఇంచార్జీలతో ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహరాల ఇంచార్జీ కుంతియా చర్చించనున్నారు. ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో డీసీసీ అధ్యక్షుల నియామకం కోసం కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చించనున్నారు. మూడు రోజుల పాటు వరుసగా ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన కొత్త నాయకత్వాన్ని జిల్లాల్లో తీసుకోనున్నారు. ఇక డీసీసీ అధ్యక్షుల ఎన్నిక తరువాత పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే పీసీసీ ప్రక్షాళన పూర్తి చేయనున్నారు. దీంతో ఇప్పుడు ఉన్న డీసీసీ అధ్యక్షులకు తమ పదవి వుంటుందో ఊడుతుందో అన్న టెన్షన్ పట్టుకుంది. మొత్తానికి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుల మార్పు నిర్ణయం ఆ పార్టీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి.